SGSTV NEWS
CrimeTelangana

భార్యతో వాగ్వాదం తర్వాత భర్త మృతి..! పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు



కుటుంబ కలహంలో నల్గొండకు చెందిన సభావత్ కిషన్ మృతి చెందాడు. రెండో భార్య శిరీషతో గొడవ తర్వాత అతను మృతి చెందాడు. శిరీష అతన్ని నెట్టేసిందని, అతను పడిపోయి మరణించాడని ఆమె చెప్పినప్పటికీ, పోస్టుమార్టం గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిపింది.


వనస్థలిపురంలో కుటుంబ కలహాలు ప్రాణాంతకంగా మారాయి. నల్గొండ జిల్లాకు చెందిన సభావత్ కిషన్ భార్యతో వాగ్వాదం తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్ మొదటి భార్య మరణించిన తర్వాత 2015లో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన శిరీషను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు మహేష్‌కుమార్, సాయిసందీప్ ఉన్నారు. శిరీషకు కూడా ఇది రెండో పెళ్ళే. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతుండగా.. శిరీష వనస్థలిపురంలోని హిల్‌కాలనీలో అద్దెకు ఇల్లు తీసుకొని అక్కడే ఉంటుంది. సోమవారం రాత్రి కిషన్ ఆమెను కలవడానికి ఆ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది ఘర్షణగా మారింది. కోపంతో శిరీష భర్తను నెట్టేయగా, అతను గోడకు తాకి కింద పడిపోయాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. అతన్ని గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. శిరీషను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ఆమె తన భర్తను నెట్టినపుడు కిందపడిపోవడం వల్లే అతను చనిపోయినట్లు అంగీకరించింది. ఇదిలా ఉండగా కిషన్ మొదటి భార్య కుమార్తె బిందు తన తండ్రిని చున్నీని గొంతుకు బిగించి హత్య చేశారని ఫిర్యాదు చేసింది. శిరీషపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ కాశీరెడ్డి తెలిపారు. ఈ కేసులో మరింత వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.

Also read

Related posts

Share this