October 18, 2024
SGSTV NEWS
CrimeNational

Airport Murder: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దారుణం.. కత్తితో పొడిచి హత్య

అనుమానం పెనుభూతమైంది. ఆవేశం విచక్షణ కోల్పోయేలా చేసింది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే అనర్థం జరిగిపోయింది. ఒక నిండు జీవితం బలైపోయింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో జరిగిన హత్య కలకలం సృష్టిస్తోంది. బుధవారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్య జరిగింది. అది అందరి కళ్ల ముందే.

కర్ణాటకలోని తుంకూరు జిల్లా మధుగిరి తాలూకా తిమ్మనహళ్లికి చెందిన వారు రామకృష్ణ, రమేష్‌. బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌లో ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు రామకృష్ణ. ఇతనికి తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానం రమేష్‌కు ఉంది. ఈ క్రమంలో వీరి మధ్య గొడవలు జరిగి 2021లో రమేష్‌, అతని భార్య విడిపోయారు. ఈ విషయమై మంగళవారం రమేష్‌, రామకృష్ణ మధ్య ఫోన్‌లో తీవ్ర వాదన జరిగింది. దీన్ని మనస్సులో పెట్టుకొని తుంకూరు నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన రమేష్‌.. అక్కడి టెర్మినల్‌ వన్‌ పార్కింగ్ ప్లేసులో ట్రాలీలు సర్దుతున్న రామకృష్ణ మెడపై కత్తితో పొడిచాడు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఒక్కసారిగా రమేష్‌ కత్తితో దాడి చేయడం, రామకృష్ణ చనిపోవడం చూసి జనాలు భయపడిపోయారు.

రమేష్‌ను అదుపులోకి తీసుకున్న CISF బలగాలు అతన్ని బెంగళూరు ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. వాస్తవానికి తమ ఊరిలోనే రామకృష్ణను చంపాలని రమేష్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. అది బెడిసికొట్టడంతో బెంగళూరు వచ్చి హత్య చేసి దొరికిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

Also read

Related posts

Share via