SGSTV NEWS online
CrimeTelangana

అడవిలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య!



గోవిందరావుపేట: చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య  చేసుకుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని టేకులకుంట గొత్తికోయ గుంపులో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది.

స్థానికులు, బంధువుల సమాచారం మేరకు మృతులను కాశపు కోమల (18), కోరం ఇరవయ్య (18)గా గుర్తించారు. వీరిద్దరూ గొత్తికోయ తెగకు చెందినవారని తెలిసింది. ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందట ఇప్పపువ్వు సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన యువతి, యువకుడు తిరిగి ఇంటికి రాలేదని బంధువులు తెలిపారు.

కాగా, కర్లపల్లి శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పస్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కచ్చతమైన కారణాలు, ఇతర వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Also read

Related posts