SGSTV NEWS online
Andhra PradeshCrime

మళ్లీ ఆడబిడ్డ పుడుతోందని…మనస్తాపంతో ఆరునెలల గర్భిణి ఆత్మహత్య


ఉరవకొండ: మూడో సంతానంగానూ ఆడబిడ్డే పుడుతోందన్న కారణంతో ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని షేక్షానుపల్లి తండాలో జరిగింది. షేక్షానుపల్లి తండాకు చెందిన రమేష్ నాయక్, సుంకమ్మ దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటికే ఐదేళ్లు, మూడేళ్లు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం సుంకమ్మ ఆరు నెలల గర్భిణి.

వారం క్రితం రమేష్ నాయక్ తన భార్యను కర్నూలులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించాడు. అక్కడ స్కానింగ్ చేసిన వారిని సుంకమ్మ ఆత్రుతగా తన కడుపులో ఉన్నది ఏ బిడ్డ అని అడిగింది. ఆడపాప అని చెప్పడంతో తీవ్ర ఆందోళన చెందింది. మూడో సంతానం కూడా ఆడబిడ్డ అయితే ముగ్గురి పోషణ భారంగా మారుతుందని, అబార్షన్ చేయించుకుంటానని చెప్పింది. ఏదైనా కానీ ఆందోళన చెందవద్దంటూ భర్త సముదాయించాడు.

కానీ లోలోపలే కుమలిపోయిన సుంకమ్మ బుధవారం రాత్రి ఇంటి ఆవరణలోని చెట్టుకు ఊరేసుకుంది. గమనించి భర్త, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Also read

Related posts