SGSTV NEWS online
Andhra PradeshCrime

తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య



దంపతులిద్దరూ దివ్యాంగులే

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడులో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాత తుంగపాడుకు చెందిన కమిడి లక్ష్మణరావు(35)కు పోలియో కారణంగా రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఔషధాలు, ఫ్యాన్సీకి సంబంధించి చిరు దుకాణం నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం శ్యామల(31)తో వివాహమైంది. ఆమె మానసిక దివ్యాంగురాలు. ఇద్దరికీ కలిపి సుమారు రూ.12 వేల పింఛను వస్తోంది. లక్ష్మణరావు అమ్మ కొన్ని నెలల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి అతను మానసికంగా కుంగిపోయారు. శనివారం అర్ధరాత్రి తర్వాత భార్యను చంపి, తానూ ఉరేసుకుని చనిపోయారు. ఆదివారం ఉదయం 9 గంటలు దాటినా ఇంట్లో అలికిడి లేకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు తలుపులు తోసి లోపలకు వెళ్లారు. ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు.

స్థానికుల సమాచారంతో రాజమహేంద్రవరం ఉత్తర మండల డీఎస్పీ సీహెచ్ జీవన, సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్, ఎస్సై జీవీవీ సత్యనారాయణ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుడి సెల్ఫోన్లో సెల్ఫీవీడియోను గుర్తించారు. అందులో ‘అమ్మ పదేపదే గుర్తుకు వస్తోంది. నేను కూడా అమ్మ దగ్గరకు వెళ్లిపోతాను. నేను లేకపోతే నా భార్యను ఎవరూ పట్టించుకోరు. అందుకే తనను చంపి, నేను కూడా చనిపోతున్నా’ అని మాట్లాడారు. శ్యామల చేతి మణికట్టు వద్ద కోయడంతో నరాలు తెగి, అధిక రక్తస్రావమై మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. లక్ష్మణరావు మంచంపై కూర్చుని ఉరేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి సోదరుడు రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts