SGSTV NEWS online
Andhra PradeshCrime

Vijayawada Accident: ఒక చేత్తో  సెల్ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి


Vijayawada Accident: నేటి యాంత్రిక జీవనంలో  వేగం పెరిగిన కొద్దీ రహదారి నిబంధనల ఉల్లంఘనలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. జరిమానాలు విధిస్తున్నా వాహన చోదకులలో మార్పు రావడం లేదు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడటం.. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని తెలిసినా చాలా మంది పెడచెవిన పెట్టి డ్రైవింగ్ చేస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడం.. సిగ్నల్స్ పాటించకపోవడం వంటి చిన్నపాటి నిర్లక్ష్యం ఒక్కోసారి నిండు ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా విజయవాడలో జరిగిన ఒక సంఘటన ఇందుకు అద్దం పడుతోంది.

విజయవాడ బెంజ్ సర్కిల్ వైపు నుంచి జాతీయ రహదారిపై ఒక యువతి తన స్కూటీపై ప్రయాణిస్తోంది. మహానాడు కూడలి దగ్గరకు రాగానే ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నిలిపివేయాలని (ఆగమని) సిగ్నల్ ఇచ్చారు. సదరు యువతి ఆ సంకేతాన్ని గమనించినప్పటికీ.. అప్పటికే ఆమె ఒక చేత్తో సెల్ఫోన్ పట్టుకుని ఉండటంతో బైక్ను నియంత్రించలేకపోయింది. బ్రేక్ వేయడానికి వీలు లేని పరిస్థితిలో నేరుగా వెళ్లి మరోవైపు నుంచి వస్తున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆమె వాహనం పైనుంచి కింద పడిపోయింది.

అదృష్టవశాత్తూ ఆ సమయంలో భారీ వాహనాలు ఏవీ రాకపోవడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. కనీసం తలకు హెల్మెట్ కూడా లేని ఆ యువతికి ఈ ప్రమాదంలో పెను ముప్పు తప్పిందనే చెప్పాలి. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని డ్రైవింగ్ చేయడం వల్ల అత్యవసర సమయంలో బ్రేకులు వేయడం లేదా వాహనాన్ని మళ్లించడం సాధ్యం కాదని ఈ ఘటన నిరూపించింది. రహదారిపై వెళ్తున్నప్పుడు మన ఏకాగ్రత కేవలం డ్రైవింగ్పైనే ఉండాలని.. సెల్ఫోన్ వాడకం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి ఉల్లంఘనల వల్ల కేవలం వాహన చోదకులే కాకుండా.. ఎదురుగా వచ్చే అమాయక ప్రయాణికులు కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అనేవి శిక్షల కోసం కాదని.. మన భద్రత కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ప్రయాణంలో ఫోన్ అత్యవసరమైతే వాహనాన్ని పక్కకు ఆపి మాట్లాడటం శ్రేయస్కరం. విజయవాడ ఘటనలో ఆ యువతికి ప్రాణాపాయం తప్పినా.. అందరికీ ప్రతిసారీ అదృష్టం కలిసిరాదని గుర్తించి బాధ్యతాయుతంగా వాహనాలను నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also read

Related posts