Boragadda Anil: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు బోరగడ్డ అనిల్ తన భార్యతో కలిసి జగన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది. తాను జగన్ను కలవడానికి వస్తే, పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కావాలనే తనను అడ్డుకుంటున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సజ్జల పై తీవ్ర ఆరోపణలు
2023 నుంచి తనను వైఎస్సార్సీపీలోకి రాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు చేస్తున్నారని బోరగడ్డ అనిల్ ఆరోపించారు. సజ్జలకు దళితులంటే అస్సలు గిట్టదని, గుంటూరు, బాపట్ల జిల్లాలకు చెందిన కొందరు నాయకులకు లబ్ధి చేకూర్చేందుకే ఆయన ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. సజ్జల చేస్తున్న ఈ అరాచకాలు, నయవంచన జగన్కు ఇప్పటివరకు తెలియవని, ఆ వ్యవహారాలన్నీ జగన్కు వివరించడానికే తాను ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు.
జైలుపాలయ్యా.. వాడుకొని వదిలేశారు!
వైఎస్సార్సీపీ కోసం పనిచేసి తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, చివరికి జైలు పాలు కూడా కావాల్సి వచ్చిందని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమున్నప్పుడు తనను వాడుకుని, ఇప్పుడు జగన్ను కలవనివ్వకుండా దూరం పెడుతున్నారని వాపోయారు. తాను ఇప్పటికే రిపబ్లికన్ పార్టీకి రాజీనామా చేశానని, వైఎస్సార్సీపీలోనే చేరుతున్నానని తెలిపారు.
తనకు పార్టీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి మద్దతు ఉందని చెప్పిన అనిల్.. జగన్ను కలిసేంత వరకు ఆయన ఇంటి ముందే బైఠాయిస్తానని స్పష్టం చేశారు. ఈ హఠాత్ పరిణామంతో తాడేపల్లిలోని జగన్ నివాస ప్రాంతంలో కాసేపు గందరగోళం నెలకొంది.
Also read
- పోలీసుల ఎదుటే గొంతు కోసుకుని..
- ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యం
- వివాహిత ఆత్మహత్య
- నన్ను వాడుకుని వదిలేశారు.. వైఎస్ జగన్ నివాసం వద్ద బోరగడ్డ అనిల్ హల్చల్!
- నువ్వేం తండ్రివయ్యా.. గొడవ పడుతుండగా నవ్వాడని.. కొడుకుని ఏం చేశాడో చూడండి..





