SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra: 9వ తరగతి బాలికకు అనారోగ్యం.. ఆస్పత్రిలో బయటపడ్డ షాకింగ్ నిజం



గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో ఓ ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల్లో గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


పోలీసులు, తల్లిదండ్రులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. కొంతమంది యువకుల మోసపూరిత వ్యవహారాలకు మైనర్లు బలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో ఓ ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


పోలీసుల వివరాల ప్రకారం.. కొలకలూరు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఇమ్మానియేల్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పాఠశాలకు వెళ్లే, వచ్చే సమయంలో బాలికతో పరిచయం పెంచుకుని ఆమె నమ్మకాన్ని సంపాదించినట్లు పోలీసులు తెలిపారు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కొద్ది రోజుల తర్వాత బాలిక అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె గర్భవతిగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం తల్లిదండ్రులు ఆరా తీయగా జరిగిన విషయం బయటపడింది.

ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిందితుడు బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కుటుంబం కొలకలూరు విడిచి గుంటూరుకు వెళ్లి నివాసం ఉంటున్నట్లు సమాచారం. విషయం పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధిత కుటుంబాన్ని బెదిరించిన వారెవరన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోందని, వారి పాత్ర తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also read

Related posts