SGSTV NEWS online
CrimeTelangana

యువతి కుటుంబంపై కత్తితో దాడి.. వన్‌సైడ్ లవర్ అరెస్ట్



హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న ప్రేమన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఆమె కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేశారు


ప్రేమ పేరుతో ఓ యువతిని వేధిస్తూ వచ్చిన యువకుడు, ఆమె తనను తిరస్కరించిందనే కక్షతో ఆమె కుటుంబంపై కత్తితో దాడి చేసిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఒకే కుటుంబానికి చెందిన పలువురిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఐదుగురు గాయపడ్డారు. స్థానికుల అప్రమత్తతతో నిందితుడు పోలీసులకు చిక్కాడు యువతిని వేధిస్తున్న వన్‌సైడ్ లవర్. పోలీసుల వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని ఎండ్ల బస్తీ, ఊర పోచమ్మ దేవాలయం సమీపంలో నివసించే కృతిక (20) అనే విద్యార్థినిని అదే ప్రాంతానికి చెందిన కాంచమీది గోవర్ధన్ (22) కొంతకాలంగా వన్‌సైడ్ లవ్ పేరుతో వేధిస్తున్నాడు. అయితే అతని ప్రవర్తన నచ్చకపోవడంతో కృతిక అతడిని దూరంగా పెట్టింది. దీంతో ఆమెపై గోవర్ధన్ కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.


తెల్లవారుజామున ఇంట్లోకి చొరబాటు..
శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3:50 నుంచి 4 గంటల మధ్య సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉండగా.. గోవర్ధన్ పక్కనే ఉన్న భవనం పైకప్పు నుంచి కృతిక ఇంటి రెండో అంతస్తులోకి చొరబడ్డాడు. తన వెంట తీసుకొచ్చిన కత్తితో కృతిక అక్క పూజిత గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడు. ఎవరైనా అరుస్తే చంపేస్తానంటూ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇంట్లో కలకలం చెలరేగడంతో కుటుంబ సభ్యులు నిద్రలేచి నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గోవర్ధన్ ఉన్మాదిలా ప్రవర్తిస్తూ కృతిక, ఆమె తల్లిదండ్రులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కుటుంబ సభ్యుల కేకలు విని సమీపంలో నివసిస్తున్న బాబాయ్ అర్జున్ అక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేయగా, అతనిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఇంట్లో నుంచి వినిపించిన ఆర్తనాదాలు, గొడవ శబ్దాలు విని స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న వారు నిందితుడు గోవర్ధన్‌ను చాకచక్యంగా పట్టుకుని బంధించారు.  అనంతరం రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించి అతడిని వారి చేతికి అప్పగించారు.




ఈ దాడిలో కృతిక ఎడమ చేతికి తీవ్ర గాయాలు కాగా.. ఆమె అక్క పూజిత వేళ్లకు గాయాలయ్యాయి. తండ్రి ఉంగరపు వేలికి గాయం అయింది. తల్లి కుడిచేతికి, ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో పాటు ఒక పన్ను కూడా ఊడిపోయినట్లు సమాచారం. వారిని కాపాడేందుకు వచ్చిన బాబాయ్ అర్జున్ కూడా రక్తగాయాలపాలయ్యాడు. ప్రస్తుతం బాధితులందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలు కృతిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు నిందితుడు గోవర్ధన్‌పై హత్యాయత్నం, అక్రమ ప్రవేశం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ప్రేమ పేరుతో వేధింపులు, తిరస్కరించారనే కారణంతో దాడులు జరగడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో స్థానికులు సకాలంలో స్పందించకపోయి ఉంటే మరింత ఘోరం జరిగే అవకాశం ఉండేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మహిళలపై వేధింపులు, స్టాకింగ్ వంటి ఘటనలను తేలికగా తీసుకోకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Also read

Related posts