SGSTV NEWS online
Andhra PradeshCrime

అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి




చిత్తూరు, జూన్ 14: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం మండలం జి.కురప్పల్లె గ్రామానికి చెందిన జయదీప్ అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. అయితే తమ కుమారుడిని పథకం ప్రకారం పిలిపించి దాడి చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..


యువతి ఫోన్‌తో గ్రామానికి వెళ్లిన జయదీప్
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గత వారం ఓ యువతి ఫోన్ చేసి గ్రామానికి రావాలని కోరడంతో జయదీప్ గంగవరం మండలం దండపల్లెకురప్పల్లె గ్రామానికి వెళ్లాడు. అనంతరం ఏం జరిగిందో తెలియదుగానీ తమ కుమారుడికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మిద్దెపై నుంచి కిందపడటంతో గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు ముందుగా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరులో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జయదీప్ శనివారం ప్రాణాలు కోల్పోయాడు.



‘కొట్టి చంపారు’.. కుటుంబ సభ్యుల ఆరోపణ
జయదీప్ మరణంపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యువతి తరఫు వ్యక్తులు తమ కుమారుడిపై దాడి చేసి చంపారని వారు ఆరోపిస్తున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు మాత్రం అతడు మిద్దెపై నుంచి కిందపడటంతో గాయపడ్డాడని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, ఈ నెల 3వ తేదీన బంగారుపాళ్యానికి చెందిన ఇద్దరు యువకులు మోటార్‌సైకిల్‌పై జయదీప్‌ను దండపల్లెకురప్పల్లె గ్రామానికి తీసుకెళ్లారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


హత్యా..? ప్రమాదమా..?

జయదీప్ గాయపడిన ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా దాడి చేసి గాయపరిచారా? అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, హత్య కేసుగా నమోదు చేసి తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఘటనపై గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక, సాక్ష్యాధారాల ఆధారంగా అసలు నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Also read

Related posts