SGSTV NEWS online
Andhra PradeshCrime

సినిమా డైరెక్టర్లనే మించిపోయారు.. ఆ ప్లానింగ్స్‌ ఏంటి భయ్యా! భర్త మర్డర్‌కు ప్రియుడితో స్కెచ్.. సిన్‌ సీన్‌కు ట్విస్టే



కాకినాడ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది భార్య. తర్వాత ఏమి ఎరగనట్టు భర్త గుండె పోటుతో మరణించాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. సీన్‌కట్‌చేస్తే.. ప్రియుడి చేసిన ఒక్క మెసేజ్‌తో సీన్‌ మొత్తం మారిపోయింది. ఇంతకు అతను చేసిన మెసేజ్ ఏమిటి.. వాళ్లు పోలీసులకు ఎలా దొరికారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లా సర్పవరంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న దుర్గాప్రసాద్‌ ఆటో నడుపుకుంటూ భార్య, ఇద్దరు కూతుళ్లను పోషిస్తున్నాడు. అయితే రెండేళ్ల క్రితం అతని గుండెకు స్టంట్లు పడటంతో ఆటో పక్కన పెట్టి, ఇంటికే పరిమితమయ్యాడు. అయితే భర్త మంచాన పడ్డాడన్న సోయి కూడా లేకుండా భార్య మరో లోకంలో మునిగిపోయింది. ఎప్పుడూ ఫోన్‌లో ఉంటూ కాలయాపన సాగించింది.

ఈ క్రమంలోనే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో తరచూ సాయి ఆమె ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఇద్దరూ కలిసి షికార్లకు కూడా వెళ్లేవారు. ఇక భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త.. ఒకరోజు ఆమెను నిలదీశాడు. ఫోన్‌లో చాటింగ్ ఆపేయాలని హెచ్చరించాడు. కానీ ప్రియుడి సుఖానికి అలవాటు పడిన భార్య మాత్రం అతని మాటలు పట్టించుకోకపోగా.. అతన్ని లేపేయాలని డిసైడ్ అయింది.



భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అనుకున్న ప్రకారం బాపట్లలో 15 నిద్రమాత్రలు కొని, ప్రియుడు వాటిని తెచ్చి ప్రియురాలికి ఇచ్చాడు. దీంతో భార్య వాటిని కర్బూజా జ్యూస్‌లో కలిపి భర్తకు ప్రేమతో ఇచ్చింది. ఆ విషయం తెలియని భర్త భార్య ప్రేమగా ఇచ్చిన జ్యూస్ తాగేశాడు. ఇంకేముంది కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అయినా భర్త చనిపోతాడో లేడో అన్న అనుమానంతో భార్య భర్త ముఖంపై దిండుతో గట్టిగా నొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది.



తర్వాత ఏమీ ఎరగనట్టు భర్తకు సడన్‌గా గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించింది. దీంతో భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే అతను మరణించాడని తెలిపింది. గుండెజబ్బు ఉన్నవాడు కాబట్టి అందరూ అది సహజ మరణమే అని నమ్మేశారు. దీంతో హమ్మయ్య.. రిలాక్స్ అని భార్య అనుకుంది.

అయితే భర్త మరణం తర్వాత భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రియుడు గోపిసాయిని ఆమె దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. దాంతో గోపిసాయికి అనుమానం పెరిగింది. ఆమె తనను కాదని మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుకున్న ప్రియుడు.. ఆమెకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.. తన తండ్రిది సహజ మరణం కాదని.. తల్లే తండ్రికి నిద్ర మాత్రలు ఇచ్చి చంపేసిందని.. ఆమె కూతురికి వాట్సప్ మెసేజ్ చేశాడు. అది చూసి దుర్గా ప్రసాద్ ఇద్దరు కూతుళ్లు షాక్ అయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో రంగంలోకి దిగిన సర్పవరం పోలీసులు విచారణ చేపట్టగా.. వీరి బండారం బయటపడింది. దీంతో భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన భార్యను, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య ఇద్దరు పిల్లలకు తండ్రి లేకుండా చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also read

Related posts