కొత్తపట్నం (ప్రకాశం జిల్లా) : చర్చికి వెళుతున్నారనే నెపంతో ఒక కుటుంబాన్ని గ్రామం నుండి బహిష్కరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబం కథనం ప్రకారం… ఈతముక్కల గ్రామ పంచాయతీ పరిధిలో చెంచు పాపాయిపాలెం పట్టపుపాలెంలో మాజీ సర్పంచ్ బసంగారి ప్రసాద్ తల్లి రాములమ్మ ఈతముక్కలలోని చర్చికి గత 40 సంవత్సరాల నుండి వెళ్తున్నారు. ఇది ఇష్టంలేని గ్రామ పెత్తందార్లు గత సంవత్సరం నుండి ఆ కుటుంబపై కక్షసాధిస్తున్నారు. గ్రామంలోని రచ్చబండ వద్దకు ప్రసాద్ను అనేకసార్లు పిలిచారు. ‘మీ తల్లి చర్చికి వెళ్లడం ఆపకపోతే మీ కుటుంబాన్ని గ్రామం నుండి వెలివేస్తాం’ అని హెచ్చరించారు. గత సంవత్సరం క్రిస్టమస్ నుండి పెత్తందార్ల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. రాములమ్మ ఇంటికి పైపులైను కట్ చేశారు. హేచరీలకు జెసిబి, ట్రాక్టర్ల ద్వారా వాటర్ తోలకం, ఇతర పనులను ప్రసాద్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రెండు హేచరీ నిర్వాహకుల వద్దకు పెత్తందార్లు వెళ్లారు. ప్రసాద్తో నీళ్లు తెప్పించుకున్నా, జెసిబి, ట్రాక్టర్ వంటి వాటితో పనులు చేయించుకున్నా, మీ హ్యాచరీ మూసివేస్తామంటూ హెచ్చరించారు. దీంతో, భయపడ్డ హేచరీ నిర్వాహకులు ప్రసాద్కు పని చెప్పకపోవడంతో ఆ కుటుంబం ఉపాధి కోల్పోయింది. గ్రామానికి చెందిన ఎవరైనా పెత్తందార్ల సమక్షంలో ఇతర గ్రామస్తుల వద్ద అప్పు తీసుకోవచ్చు. ఆ విధంగా ప్రసాద్ గ్రామస్తుల వద్ద గతంలో రూ.60 వేలు అప్పు తీసుకున్నారు. వాస్తవానికి అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ అప్పు చెల్లించడానికి గడువు ఉంది. కానీ, రూ.60 వేలు చెల్లించలేదనే నెపంతో ప్రసాద్ ఇంటికి పెత్తందార్లు ఆదివారం తాళం వేశారు. తన తల్లి రాములమ్మ చర్చికి పోతుందనే ఉద్దేశంతోనే ఇంట్లో ఉన్న వ్యక్తులను బయటకు లాగి బలవంతంగా ఆదివారం ఇంటికి తాళం వేసుకొని వెళ్లారని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కొత్తపట్నం ఎస్ఐ వి.సుధాకర్కు ఫోన్లో బాధితుడు తెలిపారు. తాను బందోబస్తులో ఉన్నానని, సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పినట్లు ప్రసాద్ తెలిపారు.
Also read
- రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
- రూ.25 లక్షలైనా ఇవ్వు, ఈ రాత్రికి ఇంటికైనా రా
- మొయినాబాద్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు.. రంగంలోకి సిట్, వారంతా బుక్కయినట్టే
- ఉగాది, శ్రీ పరాభవ నామ సంవత్సరం.. మీన రాశి ఫలితాలు!
- 2026 ఉగాది రాశిఫలాలు.. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ.. ఆ సమస్యలు తప్పవు !





