SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్నాడు.. రీల్స్ చేసేందుకు వెళ్లి..


రీల్స్ వెర్రి ప్రాణాలు తీస్తోంది. లైక్స్, ఫాలోవర్స్ వేటలో యువత ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇలా రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత ఎంత దూరమైనా వెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగర పరిధిలో దారుణం చోటుచేసుకుంది.. ఇన్‌స్టాలో రీల్స్ కోసం వెళ్లి ఓ యువకుడు మరణించాడు.. ఈ ఘటన శంషాబాద్‌ మానస హిల్స్‌లో ఆదివారం జరిగింది.. రీల్స్ చేసేందుకు వెళ్లి ఒక ఇంటర్మీడియట్‌ విద్యార్థి క్వారీలో మునిగి మృతిచెందాడు. బోరాబండ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మిర్జా షోయబ్‌ బైగ్‌ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆదివారం మానస హిల్స్‌ వద్ద ఉన్న క్వారీల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ తీయడం కోసం వీడియో షూట్‌ చేస్తుండగా షోయబ్‌ తడబడి నీటిలో పడిపోయాడు. ఈ విషయాన్ని ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ కె. బాలరాజు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్, డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకుని షోయబ్‌ను రక్షించేందుకు ప్రయత్నించాయి. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు.. కొంతసేపటికి షోయబ్‌ మృతదేహాన్ని నీటి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే.. షోయబ్ మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడు మానస హిల్స్‌కు వెళ్తున్న విషయం తెలియదని షోయబ్‌ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆడుకుంటానికి బయటకు వెళ్తున్నానని చెప్పినట్లు వెల్లడించారు.


ఎదిగిన తర్వాత తమకు ఆసరాగా ఉంటాడనుకున్న తనయుడు.. అలా విగతజీవిగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఈ విషాదకర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts

Share this