SGSTV NEWS online
Crime

ఉదయం పరిచయం.. మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి శోభనం అంటే పరిగెత్తిన వరుడు.. తీరా చూస్తే..!



హైదరాబాద్ మహానగరంలో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉదయం పరిచయం… మధ్యాహ్నం పెళ్లి.. సాయంత్రం షాపింగ్.. రాత్రి డిన్నర్.. ఆ తర్వాత శోభనం.. కానీ తెల్లారేసరికి పెళ్లికూతురు కనిపించకపోవడంతో నవ వరుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ విచిత్ర ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.


తనకు మంచి సంబంధం వచ్చిందని చెప్పడంతో యువతిని కలిశాడు ఓ యువకుడు. ఇద్దరికీ పరిచయం అయిన అదే రోజు వివాహం కూడా జరిపించారు. పెళ్లికి ముందు వధువు పేరుతో వరుడి డబ్బులతో వేల రూపాయల విలువైన షాపింగ్ కూడా చేసుకుంది. వివాహం అనంతరం ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి డిన్నర్ చేశారు. అనంతరం శోభనం కోసం ఓ హోటల్‌లో గది తీసుకున్నారు. అక్కడ తనకు మూడ్ లేదని, కొబ్బరి నీళ్లు తీసుకురావాలని వధువు వరుడిని బయటకు పంపించింది. కొద్దిసేపటి తర్వాత నడుము నొప్పిగా ఉందని, ఇంటికి వెళ్లాలని వధువు చెప్పడంతో వరుడు ఆమెను కారులో పంపించాడు.

అనంతరం వధువు అక్కగా పరిచయం చేసుకున్న మహిళ ఫోన్ చేసి, ఇంట్లోనే శోభనం ఏర్పాటు చేశాం.. మీరు ఇక్కడికి రండి అని చెప్పింది. అయితే, వారు చెప్పిన చిరునామాకు వెళ్లిన వరుడికి అక్కడ అలాంటి ఇల్లు లేకపోవడంతో అనుమానం వచ్చింది. ఫోన్ చేసిన వారందరూ అందుబాటులో లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు. సంబంధం చూపించిన మహిళ, పెళ్లి జరిపించిన వ్యక్తి కూడా కనిపించకుండా పోయారని బాధితుడు ఆరోపించాడు.


దీంతో అర్థరాత్రి బహదూర్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ముందే పన్నిన పెళ్లి మోసమా? లేక మరెవరైనా ఈ ఘటనలో భాగస్వాములా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

Also read

Related posts