అమరావతి: వైసీపీ గజదొంగలు శ్రీవారి సొత్తూ దోచుకున్నారు. వందకోట్ల పరకా’మనీ’ దొంగ వెనుక ఆ పార్టీ నేతలు ఉన్నారని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ధ్వజమెత్తారు. ఈ మేరకు వీడియోను ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు.
“జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. అరాచకం పెచ్చరిల్లింది. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్ లకు ఏపీని కేరాఫ్ అడ్రస్ మార్చారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్.. చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదల్లేదు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారు. రూ.కోట్ల విలువైన సొత్తు కొల్లగొట్టారు. ఆ డబ్బులు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు. తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు వాటాలు అందాయని నిందితులే చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు రూ.వందల కోట్లు రవికుమార్ దోచుకుని వెళ్లినప్పుడు టీ టీ డి చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. అతడి మనుషులు ఏకంగా ఈ కేసును లోక్ అదాలత్ లో రాజీ చేయడానికి యత్నించారు.
అధికార అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూను కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు.
ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దని.. నాడు చంద్రబాబు బతిమాలి చెప్పినా జగన్ వినలేదు. ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ సామీ. ఆయనకు అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా.. ఏం జరుగుతుందో తెలిసికూడా జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారు. గుడిలో హుండీని దోచేసిన పాపాలతో జగన్ గ్యాంగ్ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారు” అని లోకేశ్ పేర్కొన్నారు.
Also read
- అతడొక డెలివరీ బాయ్.. తెల్లారి పార్శిళ్లు.. రాత్రుళ్లు ఆ యవ్వారం.!
- పిఠాపురం పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్.. వర్మకు టీడీపీ ఊహించని షాక్.. అసలు కారణం ఇదే..
- సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఎంతకు తెగించాడంటే..
- రెండు రోజుల్లో కుమార్తె వివాహం…
- అత్యాశకు పోయి.. అధిక వడ్డీ వలకు చిక్కి..





