SGSTV NEWS online
Andhra PradeshCrime

దొంగను పట్టించిన చెప్పులు.. రెండు నెలల తర్వాత దొరికిన అసలైన క్లూ!




తిరుపతి జిల్లాలో జరిగిన ఓ చోరీ కేసులో దొంగలు చేసిన చిన్న పొరపాటు చివరకు వారినే పోలీసులకు చిక్కేలా చేసింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ దొంగతనం కేసును పోలీసులు ఛేదించడంలో దొంగ వదిలి వెళ్లిన చెప్పులే కీలక ఆధారంగా మారాయి. దీంతో దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు, చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

సూళ్లూరుపేట మండలం మన్నెముట్టూరు గ్రామంలో నివాసం ఉంటున్న ఓ చర్చి ఫాదర్ ఇంట్లో రెండు నెలల క్రితం భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ఫాదర్ ఇంటికి తాళం వేసుకుని బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన ఇద్దరు యువకులు తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో దాచిన రూ.2 లక్షల నగదు, సుమారు రూ.7 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు.



అయితే దొంగతనం చేసే సమయంలో నిందితుల్లో ఒకరు తన చెప్పులను ఇంటి బయట వదిలి లోపలికి వెళ్లాడు. దొంగతనం పూర్తయ్యాక హడావుడిలో వాటిని తీసుకెళ్లడం మరిచిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన యజమాని చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా బయట కనిపించిన చెప్పులు అనుమానాలకు తావిచ్చాయి.

ఆ చెప్పుల ఆధారంగా పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో గ్రామానికి తరచూ వచ్చి వెళ్లే పాకం మనోజ్, తోప్పాని ఈశ్వర్ అనే ఇద్దరిపై అనుమానం కలిగింది. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చివరకు నేరాన్ని ఒప్పుకున్నారు.

నిందితుల వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, రూ.7 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేవలం ఒక జత చెప్పులే ఈ కేసులో కీలక ఆధారంగా మారి దొంగలను కటకటాల వెనక్కి నెట్టాయి. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు బృందాన్ని నాయుడుపేట డీఎస్పీ చెంచు బాబు అభినందించి రివార్డులు అందజేశారు. దీంతో “దొంగను పట్టించిన చెప్పులు” కథ స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also read

Related posts