SGSTV NEWS online
CrimeTelangana

కాగితాలు ఏరుకునే వ్యక్తి పేరిట.. బీమా మోసం!



సుల్తాన్బజార్: చనిపోయిన వ్యక్తి పేరు మీద రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని బీమా డబ్బులు కాజేయాలని చూసిన ఓ ముఠా గుట్టును సుల్తాన్బజార్ పోలీసులు రట్టు చేశారు. చాదర్ ఘాట్ వద్ద కాగితాలు ఏరుకుంటూ బతికే తలారి వెంకటయ్య అనే వ్యక్తి 2023 జనవరి 9న విద్యుదాఘాతంతో చనిపోయాడు.

ఈ మరణాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న బోడ శ్రీకృష్ణ అనే వ్యక్తి స్టార్ హెల్త్ ఏజెంట్ మల్దే మహేష్, సేల్స్ మేనేజర్ మడసిరావార వంశీకృష్ణలతో కుమ్మకై పక్కా స్కెచ్ వేశాడు. 2024 డిసెంబర్లో వెంకటయ్య పేరు మీద స్టార్ హెల్త్ యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకున్నారు. మృతుడి బావమరిదినంటూ శ్రీకృష్ణ నామినీగా నమోదు చేసుకున్నాడు. 2025 ఏప్రిల్ 28న ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల పాత ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం, ఇన్వెస్ట్ రిపోర్టులను ఫోర్జరీ చేశారు.

క్లైమ్ కోసం దరఖాస్తు చేయగా స్టార్ హెల్త్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మహ్మద్ అబ్దుల్ బారీ చేసిన అంతర్గత విచారణలో బండారం బయటపడింది. పాలసీ తీసుకోవడాని కంటే ముందే వెంకటయ్య చనిపోయాడని తేలడంతో 2026 మే 14న సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడికి తరలించారు. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ మత్తయ్య పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ నరేష్, ఎస్ఐ వేణు ఈ కేసును ఛేదించారు.

Also read

Related posts