SGSTV NEWS online
Andhra PradeshCrime

స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. విశాఖ బీచ్ లో ఇద్దరు గల్లంతు

విశాఖపట్నంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు విషాదంగా మారాయి. స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతి, యువకుడు భారీ అలల్లో గల్లంతయ్యారు. ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఎగసిపడిన కెరటం ఈ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

విశాఖపట్నంలోని పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్‌లో ఆదివారం ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పెద జాలారిపేటకు చెందిన నీతూ, రాము తమ స్నేహితులతో కలిసి ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా బీచ్‌కు వెళ్లారు. మొత్తం ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు సముద్ర తీరంలో సందడి చేశారు. ఈ క్రమంలో ఫోటోలు తీసుకునేందుకు సముద్రంలోని రాతిపై నిలబడ్డారు. అదే సమయంలో ఒక్కసారిగా భారీ కెరటం ఎగసిపడటంతో నీతూ, రాము సముద్రంలో పడిపోయారు. అక్కడున్న స్నేహితులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన ఇద్దరి కోసం పోలీసులు, స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలిస్తున్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు, ఫోటోల కోసం సముద్రంలోని రాళ్లపైకి వెళ్లొద్దని, అలల తీవ్రతను తక్కువగా అంచనా వేయవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గల్లంతైన యువతి, యువకుడి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also read

Related posts