సికింద్రాబాద్ లోని సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు రెండోసారి చేపట్టిన సోదాలు ముగిసాయి. సురానా ఇంట్లో ఈడీ సోదాలు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా భారీగా నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ED Raids: సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు రెండోసారి చేపట్టిన సోదాలు ముగిసాయి. సురానా ఇండస్ట్రీస్ ఎండి నరేంద్ర సురానా ఇంట్లో ఈడీ సోదాలు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా భారీగా నగదు .. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవులకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణంతో షేల్ కంపెనీలకు నిధుల బదలాయింపు చేశారని, పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు నిర్ధారించారు. కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ సతీష్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వట్టి నాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్పై ఈడీ విచారణ చేసింది.సతీష్ ఇంట్లో కూడా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా వివిధ బ్యాంకులకు రూ.13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కేసులో రియల్ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ సంస్థలు- సాయిసూర్య డెవలపర్స్, ఆర్యవన్ ఎనర్జీలపై చెన్నైవిభాగం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.మాదాపూర్, జూబ్లీహిల్స్, బోయిన్పల్లిలోని సురానా గ్రూప్ కంపెనీ చైర్మన్ నరేందర్ సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లతో పాటు సాయిసూర్య డెవలపర్స్ కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి. సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్పై గతేడాది సైబరాబాద్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ తో పాటు చెన్నై, బెంగళూరులో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలపై 2019లో నమోదైన సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసు ఆధారంగా మనీల్యాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. సురానా గ్రూప్ చైర్మన్, ఇతర డైరెక్టర్లు చెన్నైలో నివసిస్తున్నా.. వారికి హైదరాబాద్లో వ్యాపారాలున్నాయి
దీంతో..హైదరాబాద్లోని సురానా గ్రూప్, సాయిసూర్య, ఆర్యవన్ ఎనర్జీ కార్యాలయాలు, వాటి డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో బోయినపల్లి డైమండ్ పాయింట్ సమీపంలోని అరిహంట్ కార్డు మాస్టర్ ఎన్క్లేవ్ కాలనీలోని సురానా యజమానుల ఇంట్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారుల సోదాలు కొనసాగాయి. కీలకమైన పత్రాలు, భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు.. సురానా గ్రూప్ ఎండీ దేవేందర్ సురా నా ఇళ్లు, కార్యాలయాలు, సాయిసూర్య, ఆర్యవన్ ఎనర్జీ కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు జరిగాయి. కాగా.. సాయిసూర్య డెవలపర్స్ ఎండీ సతీశ్చంద్ర గుప్తాపై ఇటీవలే పోలీసులకు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టిస్తామంటూ ప్రీలాంచ్పేరిట కోట్లను వసూలు చేసి, మోసగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రూ.113.32 కోట్ల విలువైన స్థిరచరాస్తులను తాత్కాలికంగా ఈడీ అధికారులు జప్తు చేశారు. తమ బంధువులు, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉద్యోగులను డైరెక్టర్లుగా నియమించి దినేష్ చంద్ సురానా బ్యాంకులను మోసం చేశారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. సురానా గ్రూప్ కేమన్ ఐలాండ్తో పాటు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లలో డమ్మీ డైరెక్టర్లను నియామకం చేసి.. ఆయా కంపెనీల్లోకి బ్యాంకు రుణాలను సురానా మళ్లించారు. సింగపూర్లో నాలుగు కంపెనీలు స్థాపించి వస్తువుల ఎగుమతి చేసి ఆ డబ్బును సురానా భారతదేశంలో అందుకున్నారు. దారి మళ్లించిన నిధులలో కొంత భాగాన్ని వివిధ బినామీ, కంపెనీల పేర్లలో చరాస్తులు, స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్టు ఈడీ అధికారులు నిర్ధారించారు.
సోదాల సందర్భంగా కంపెనీల చైర్మన్, ఎండీలు సహా కార్పొరేట్ ఆఫీసుల్లో పలు హార్డ్డిస్కులు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పేరుతో వసూలు చేసిన డబ్బును ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. వట్టినాగులపల్లిలో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రచారం చేశాయి. సాయితులసీ ఎన్క్లేవ్, షణ్ముక నివాస్ పేరుతో ప్లాట్ల విక్రయాలను ప్రారంభించాయి. ఒక్కో ప్లాట్కు రూ.3.25 కోట్ల చొప్పున కస్టమర్లతో అగ్రిమెంట్లు చేసుకున్నాయి. అడ్వాన్స్గా రూ.1.45 కోట్లు వసూలు చేశాయి. అయితే, ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు నిరుడు నవంబరులో సైబరాబాద్ ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు.
Also read
- Jyoti Malhotra: ఆమె ఎందుకొచ్చింది.. హైదరాబాద్లో జ్యోతి జాడలు.. పెద్ద కథే ఉందిగా..
- Hyderabad: అబ్బా.. లచ్చిందేవి.. లచ్చిందేవి.. ATM నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం
- Telangana: ధాన్యం బస్తాలో డబ్బు దాచిన భర్త.. తెలియక భార్య ఏం చేసిందంటే?
- Andhra News: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి!
- మాయదారి కారు ఎక్కకపోయినా బాగుండేది.. పాపం నలుగురు చిన్నారులు..