కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్ నుంచి బయల్దేరిన కాసేపటికే ఓ ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించేయడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వివరాల్లోకి వెళ్తే..సుమారు 41 మంది ప్రయాణికులతో కరీంనగర్ నుంచి ఓ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు హైదరాబాద్కు బయల్దేరింది. ఆ బస్సు తిమ్మాపూర్ మండలం అలుగునూరు పరిధిలోకి రాగానే, ఒక్కసారిగా బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. దీన్ని గమనించిన డ్రైవర్ క్షణాల్లో స్పందించి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. వెంటనే బస్సులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించేశాడు.
రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది
ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ స్థానిక అగ్నిమాపక (ఫైర్) సిబ్బందికి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ సహాయంతో పక్కకు జరిపి, రోడ్డుపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేశారు. అనంతరం ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా మరో బస్సును ఏర్పాటు చేసి, వారిని గమ్యస్థానాలకు పంపించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also read
- లక్ష్మీదేవికి కోపం తెప్పించే దానాలు ఇవేనా? తెలియక చేస్తే పుణ్యం కాదు, పాపమే!
- Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి.. ఒక్క ఉపవాసంతో 26 ఏకాదశుల పుణ్యం.. ఈ మహా వ్రతం ఎప్పుడో తెలుసా.?
- నేటి జాతకములు 22 జూన్, 2026
- విజయవాడ : సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బస్టాండ్ నుండి బయల్దేరిన కాసేపటికే బస్సులో మంటలు.. డ్రైవర్ ఏం చేశాడంటే





