SGSTV NEWS online
CrimeTelangana

దారుణం.. బైక్‌ను ఢీకొట్టిన కారు.. కారు బానెట్‌పై 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌..



హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. టూ వీలర్‌ను ఢీకొట్టిన కారు డ్రైవర్, ఓ వ్యక్తిని కారు బానెట్‌పై సుమారు 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. స్థానికులు అడ్డుకోవడంతో వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనలో జిలానీ కొడుకు ఫైసల్ తీవ్రంగా గాయపడగా, మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.


హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఓ కారు.. టూ వీలర్‌ను ఢీకొట్టి బీభత్సం సృష్టించింది. అడ్డుకున్న బాధితుడిని కారు బానెట్‌పై రెండు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు కారు డ్రైవర్‌. ఆ తర్వాత స్థానికులు అడ్డుకోవడంతో బాధితుడిని వదిలేశాడు. గాయత్రి నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి ఎస్‌కే జిలానీ, అతని కొడుకు ఫైసల్‌ను ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, కారులో ఉన్న వ్యక్తి ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేశాడు. అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.


ఈ క్రమంలో తండ్రి ఎస్‌కే జిలానీ కారును ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వాహనం ఆపకుండా ముందుకు దూసుకెళ్లాడు. జిలానీ కార్ బానెట్‌పై ఉండగానే సుమారు రెండు కిలోమీటర్ల మేర లాగుతూ తీసుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. కారు బాలాపూర్ చౌరస్తా వరకు వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి మందమల్లమ్మ చౌరస్తా వద్దకు వచ్చాక అక్కడ ప్రయాణికులు అడ్డుకోవడంతో డ్రైవర్ బాధితుడిని వదిలి పరారయ్యాడు.


ఈ ప్రమాదంలో కొడుకు ఫైసల్ తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం అతను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts