SGSTV NEWS online
CrimeTechnology

Hyderabad: 56 లక్షలతో జంప్.. పుణేలో జల్సాలు.. కట్ చేస్తే.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో..



హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఏటీఎం నగదు రవాణా వాహనం చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఏటీఎంలకు నగదు నింపే వాహనం నుండి రూ.56 లక్షల నగదుతో పరారైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12వ తేదీన గోపనపల్లి తండా ప్రాంతంలో సంగెం సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వాహనం ఏటీఎంలకు నగదు సరఫరా చేస్తోంది. సిబ్బంది ఏటీఎంలో నగదు నింపే పనిలో నిమగ్నమై ఉండగా వాహనం బయట ఉన్న డ్రైవర్ అజిత్ కుమార్ అలియాస్ శివ వాహనంతో సహా ఉడాయించాడు. తోటి సిబ్బందిని మభ్యపెట్టి గద్దర్ చౌరస్తా, నల్లగండ్ల ప్రాంతాలకు వెళ్లి అక్కడ నగదు ఉన్న ట్రంక్ బాక్స్‌ను తీసుకుని వాహనాన్ని వదిలేసి ఆటోలో పారిపోయాడు.

పోలీసుల వేట.. నిందితుడి పలాయనం
అదే రోజు రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలోని ఒక లాడ్జ్‌లో సాధారణ ప్రయాణికుడిలా బస చేశాడు. అక్కడ యాక్స్ బ్లేడ్‌తో నగదు పెట్టెను తెరిచి, డబ్బును బ్యాగ్‌లో సర్దుకున్నాడు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి 13న తన స్వస్థలమైన అనంతపురం జిల్లాకు చేరుకున్నాడు. అక్కడి నుండి బళ్లారి, బెంగళూరు, పుణే వంటి నగరాల్లో తిరుగుతూ కళ్లుగప్పే ప్రయత్నం చేశాడు.

విమానాశ్రయంలో చిక్కిన దొంగ
సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలను నిరంతరం ట్రాక్ చేసిన గచ్చిబౌలి పోలీసులు.. శంషాబాద్ విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.34,90,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని నిందితుడు జల్సాల కోసం ఖర్చు చేసినట్లు విచారణలో అంగీకరించాడు. డ్రైవర్ల నియామకంలో కనీస జాగ్రత్తలు పాటించని సంగం సెక్యూరిటీ ఏజెన్సీపై పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ చట్టం-2005 ప్రకారం సదరు సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా అప్రమత్తంగా వ్యవహరించి నిందితుడి అనుమానాస్పద కదలికలను గమనించి పోలీసులకు సమాచారం అందించిన ఎస్‌వీఆర్ బస్ ట్రావెల్స్ డ్రైవర్ ఉమాకాంత్‌ను పోలీసులు అభినందించారు.

Also read

Related posts