ముస్సోరి మంచుకొండల్లో ఎంతో సంతోషంగా, అన్యోన్యంగా గడిపింది రాధాగాయత్రి-శ్రీచరణ్ జంట. అంతలోనే ఒకరు శవమై తేలారు. మరొకరు నిందితుడి స్థానంలో నిలబడ్డారు. అదసలు హఠాన్మరణమా? కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఏదైనా కుట్రా? సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంటా 38 నిమిషాలకు అల్లుడి ఫోన్ నుంచి వచ్చిన ఆ ఒక్క సెల్ఫీ ఫొటో.. ఇప్పుడీ కేసులో కీలకంగా మారింది. ఒకవైపు కూతురి మృతిపై తండ్రి సంచలన ఆరోపణలు.. మరోవైపు తానేమీ చేయలేదంటూ భర్త ఇస్తున్న వివరణ. అసలు ఆ రాత్రి ముస్సోరి హోటల్ గదిలో ఏం జరిగింది?
విశాఖ టెకీ.. రాధా గాయత్రి మృతి కేసు ఉత్తరాఖండ్ డీజీపీ దగ్గరికి వెళ్లింది. పూటకో అనుమానాలు బయటికొస్తున్న నేపథ్యంలో అసలు నిజాలు తేల్చాలని రాధా గాయత్రి తండ్రి ముస్సోరీలో కంప్లైంట్ చేశారు. అక్కడ.. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్పై మర్డర్ కేసు కూడా ఫైల్ అయింది.
అంతకంటే ముందు.. రాధా గాయత్రి, శ్రీచరణ్ తీసుకున్న వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గాయత్రి మరణానికి ముందురోజు ఇద్దరూ జాలీగా తిరిగినట్టు ఈ ఫొటోలు, వీడియోల్లో తెలుస్తోంది. రిషికేష్, డెహ్రాడూన్లోని పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ, ఎంజాయ్ చేసినట్లు అర్థం అవుతోంది. ఇద్దరూ కలిసి బంగీ జంప్ సహా వివిధ స్పోర్ట్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్లోనూ పార్టిసిపేట్ చేశారు. డెహ్రాడూన్ క్లాక్ టవర్ దగ్గర గాయత్రి, శ్రీ చరణ్ సెల్ఫీ కూడా తీసుకున్నారు. రిషికేష్లో బంగీ జంప్.. బోటింగ్ చేశారు. స్వయంగా శ్రీ చరణ్ ఈ ఫొటోలు, వీడియోలు తీశారు. ఇద్దరూ కలిసి రెంట్కు తీసుకున్న స్కూటీలో తిరుగుతూ ఫోటోలు తీసుకున్నారు. రిషికేష్లో అంత జాలీగా ఉన్న ఇద్దరు.. అసలు ముస్సోరీకి ఎందుకెళ్లారు? ముస్సోరీలో ఏం జరిగింది? ఇదే తేల్చాలని పట్టబుడుతున్నారు గాయత్రి పేరెంట్స్.
ఈ క్రమంలోనే శనివారం నాడు ముస్సోరి పోలీస్ స్టేషన్లో రాధా గాయత్రి తండ్రి సుధాకర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అల్లుడు శ్రీచరణ్పైనే తమకు నూటికి నూరు శాతం అనుమానాలు ఉన్నాయంటూ కొన్ని కీలక ఆధారాలను పోలీసులకు అప్పగించారు. కుటుంబ సభ్యులకు కేవలం రుషికేశ్, హరిద్వార్ యాత్ర గురించే చెప్పారని.. టూర్ ప్లాన్లో ముస్సోరి ఉన్నట్లు తమకు అస్సలు చెప్పలేదని సుధాకర్ చెబుతున్నారు. అంతేకాదు, జూన్ 14వ తేదీ రాత్రి భార్యాభర్తలు ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఒక సెల్ఫీ ఫొటోను శ్రీచరణ్ ఫోన్ నుంచి పంపించాడని.. ఎప్పుడూ లేని విధంగా అర్ధరాత్రి దాటాక 1:38 గంటలకు ఆ సెల్ఫీ పంపడం కూడా అనుమానంగా ఉందన్నారు. బంగీ జంప్కు వెళ్లామని శ్రీచరణ్ చెబుతున్నా.. వారిద్దరి ఫోన్లలో దానికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని చెప్పుకొచ్చారు తండ్రి సుధాకర్.
రాధాగాయత్రి మృతిపై.. తండ్రి సుధాకర్కు ఇంకొన్ని అనుమానాలున్నాయ్. రాత్రి ఆహారంలో తన కూతురికి శ్రీచరణ్ ఏదైనా కలిపి ఇచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. రాధాగాయత్రికి లో-బీపీ ఉందని శ్రీచరణ్ చెబుతున్నా.. అవన్నీ అబద్ధాలేనని, తన కూతురికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చారు. శ్రీచరణ్ ఆర్థిక లావాదేవీలు, హోటల్లో సీసీ ఫుటేజీ పరిశీలిస్తే అసలు విషయాలు బయటపడతాయంటున్నారు తండ్రి సుధాకర్. ఈ అనుమానాల నేపథ్యంలో, సుధాకర్ ఇచ్చిన కంప్లైంట్తో శ్రీచరణ్పై మర్డర్ కేస్ ఫైల్ చేశారు ముస్సోరీ పోలీసులు.
అయితే.. శ్రీచరణ్ తన వర్షన్ చెబుతున్నారు. ఈనెల 13న తామిద్దరం రిషికేశ్ బయల్దేరాం, 14న గంగానదికి వెళ్లాం, అదే రోజు రాత్రి 11:30 గంటలకు ముస్సోరిలోని హోటల్లో బస చేశాం, అక్కడ ఇచ్చిన రెడ్ వైన్ తాగి నిద్రపోయాం అని చెప్పాడు శ్రీచరణ్. తీరా.. తెల్లవారుజామున లేచి చూసేసరికి గాయత్రి ముక్కులోంచి రక్తం వస్తూ అపస్మారక స్థితిలో ఉందని, ఆ తర్వాతే చనిపోయిందని శ్రీచరణ్ వాదిస్తున్నాడు. పోస్టుమార్టం నివేదిక వస్తే అసలు నిజాలు ఏంటో అందరికీ తెలుస్తాయని అంటున్నాడు. భర్త శ్రీచరణ్ తానేమీ చేయలేదని చెబుతున్నప్పటికీ.. ముస్సోరి పోలీసులు మాత్రం శ్రీచరణ్పై మర్డర్ కేసు నమోదు చేశారు.
Also read
- ఆమె తలలో బుల్లెట్టా.. ఇనుప ముక్కా? అంతుచిక్కని వైనం!
- కాలేజీకెళ్లినా.. బతుకుదువు బిడ్డా!
- ఇంటి నుంచి బయలుదేరిన క్షణాల్లోనే విషాదం.. హిట్ అండ్ రన్లో నర్స్ మృతి
- చిన్న కథ కాదురా సామి మీతో.. రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
- ఎవర్రా మీరంతా.. కార్లలో వస్తారు.. పశువులకు మత్తు మందు ఇస్తారు.. ఆ తర్వాత..





