SGSTV NEWS online
Andhra PradeshCrime

కరిగించి అమ్మితే కనిపెట్టలేరనుకున్నాడు.. కానీ నెల్లూరు పోలీసులు ‘ముద్ద’ తినిపించారు!


దొంగతనాల్లో ఎన్నో రకాలు చూస్తుంటారు. కానీ అతని టార్గెట్ మాత్రం కేవలం రైల్వే ప్రయాణికులు మాత్రమే..! రన్నింగ్ ట్రైన్‌లో కిటికీ వద్ద కూర్చున్న మహిళలు, చిన్నారుల మెడలోని నగలు తెంచుకుని వెళ్లిపోతాడు. నిద్రపోతున్న ప్రయాణికులు మెడలో నుంచి బంగారు దోచుకెళ్తాడు. రైలు ప్రయాణికులే లక్ష్యంగా చేసుకొని, దొంగిలించిన బంగారాన్ని ఎవరికీ అనుమానం రాకుండా కరిగించేస్తాడు. ఇలా దొంగ బంగారాన్ని విక్రయిస్తున్న ఒక కిలాడీ దొంగను నెల్లూరు రైల్వే పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. నిరంతరం నిఘా ఉంచి, పక్కా ప్లాన్‌తో ఈ మోస్ట్ వాంటెడ్ దొంగ షేక్ మీర్జావలిని అదుపులోకి తీసుకున్నారు.

తిరుపతికి చెందిన షేక్ మీర్జావలి అనే వ్యక్తి గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. తన జల్సాల కోసం రైల్వే ప్రయాణికులను దోచుకోవడమే వృత్తిగా మార్చుకున్నాడు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, విజయవాడ రైల్వే లైన్లలో ఇతని ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. రైలు ప్లాట్‌ఫామ్ మీద ఆగినప్పుడు లేదా నెమ్మదిగా కదులుతున్నప్పుడు కిటికీ పక్కన కూర్చున్న మహిళలు, వృద్ధులే ఇతని మొదటి టార్గెట్. రెప్పపాటు కాలంలో వారి మెడలోని గొలుసులను తెంచుకుని పరార్ అవుతాడు. అంతేకాదు రన్నింగ్ ట్రైన్‌లో ఒక బోగీ నుంచి మరో బోగీలోకి తిరుగుతూ, గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల నగలను అత్యంత చాకచక్యంగా దోచుకెళ్లడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య.

దోచుకున్న నగలను నేరుగా షాపుల్లో అమ్మితే పోలీసులకు దొరికిపోతామని మీర్జావలికి బాగా తెలుసు. అందుకే అతను ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. దొంగిలించిన బంగారాన్ని కంసాలి వద్దకు తీసుకెళ్లి, వాటిని కరిగించి చిన్న చిన్న ముద్దలుగా లేదా గోళీలుగా మార్చేవాడు. ఆ తర్వాతే వాటిని విక్రయించేవాడు. ఇలా చేయడం వల్ల అది దొంగిలించిన సొత్తు అని గుర్తించడం పోలీసులకు కష్టమయ్యేది.

గతంలో పలుమార్లు జైలుకు వెళ్లినా మీర్జావలి తీరులో మార్పు రాలేదు. తిరుపతిలో పోలీసులు నిఘా పెంచడంతో తన కాపురాన్ని గూడూరుకు మార్చాడు. అక్కడి నుండి తన దొంగతనాల నెట్‌వర్క్‌ను కొనసాగించాడు. వరుస చోరీలతో విసిగిపోయిన నెల్లూరు రైల్వే పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణ సమయంలో కిటికీల వద్ద కూర్చున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు నగలు, విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు.

Also read

Related posts