SGSTV NEWS online
Andhra PradeshCrime


ఆ కంగారు వెనుక కథేంటి? బాలిక అంత్యక్రియల తర్వాత బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్..!



కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో ఒక విద్యార్థిని మృతి తీవ్ర కలకలం రేపుతోంది. తొలుత సాధారణ మరణంగా భావించి అంత్యక్రియలు పూర్తి చేసినప్పటికీ, నాలుగు రోజుల తర్వాత తల్లిదండ్రులకు వచ్చిన అనుమానాలతో పోలీసులు మృతదేహాన్ని మళ్లీ బయటకు తీశారు.


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉంగుటూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన ఒక బాలిక 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో సదరు విద్యార్థిని ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన తల్లిదండ్రులు, బంధువులు అదే రోజు సాంప్రదాయబద్ధంగా విద్యార్థిని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి, గ్రామ స్మశాన వాటికలో ఖననం చేశారు.

అయితే, అంత్యక్రియలు ముగిసిన నాలుగు రోజుల తర్వాత కుమార్తె మృతిపై తల్లిదండ్రులకు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆత్మహత్య కాదని, దీని వెనుక ఏదో జరిగి ఉంటుందని అనుమానిస్తూ వారు ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఈ క్రమంలోనే ఉంగుటూరు తాసిల్దార్ విమల, గన్నవరం సీఐ శివ ప్రసాద్ సమక్షంలో శనివారం విద్యార్థిని మృతదేహాన్ని స్మశాన వాటిక నుండి బయటకు వెలికితీశారు. అనంతరం అక్కడే ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే బాలిక మృతికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

Also read

Related posts