SGSTV NEWS
Andhra PradeshCrime

Atmakur: ఏఈ శరభారెడ్డి డ్యూటీకి – ఇంట్లో వాళ్లు పోస్ట్ వెడ్డింగ్ షూట్‌కి – తిరిగి వచ్చేసరికి



నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో దుండగులు పగటిపూట భారీ చోరీకి పాల్పడ్డారు. సాయిబాబానగర్‌లో నివసించే తెలుగుగంగ ఏఈ శరభారెడ్డి కుటుంబం బయట ఉన్న సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి దాదాపు 60 తులాల బంగారం, రూ 27 లక్షల నగదును దోచుకెళ్లారు.


నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. పట్టణంలోని సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న తెలుగుగంగ పథకం ఏఈ శరభారెడ్డి తన విధి నిర్వహణలో భాగంగా నంద్యాల కలెక్టరేట్‌లో జరిగే జా సమస్యల పరిష్కార వేదికకు హాజరయ్యేందుకు వెళ్లారు. ఇటీవల ఆయన కుమార్తె వివాహం జరగడంతో పోస్టు వెడ్డింగ్‌ షూట్‌ కోసం కుటుంబసభ్యులు నల్లకాల్వ సమీపంలోని వైఎస్‌ఆర్‌ స్మృతివనానికి వెళ్లారు. ఇదే అదనుగా దుండగులు ఇంటి తలుపులు పగటగొట్టి చోరీకి పాల్పడ్డారు. బెడ్‌రూమ్‌లోని బీరువాకు కూడా తాళాలు వేయకపోవడంతో అందులో ఉన్న దాదాపు 60 తులాల బంగారుతో పాటు పక్కనే కబోర్డులోని సూట్‌కేసులో ఉంచిన రూ.27లక్షల నగదును ఎత్తుకెళ్లారు.


మధ్యాహ్నం 2గంటల సమయంలో తిరిగి వచ్చిన ఏఈ శరభారెడ్డి ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఆత్మకూరు అర్బన్‌ సీఐ రాము ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే చోట భారీగా బంగారం, నగదు దొరకడంతో.. ఆలస్యం చేయకుండా మరో కబోర్డులో ఉంచిన నాలుగున్నర లక్షల నగదు, ఇతర వెండి ఆభరణాల జోలికి వెళ్లకుండా దొంగలు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Also Read

Related posts

Share this