SGSTV NEWS
Andhra Pradesh

కోర్టు ధిక్కారం కేసులో భారీ మూల్యం చెల్లించుకున్న డిప్యూటీ కలెక్టర్‌! సుప్రీం సంచలన తీర్పు



ఆంధ్రప్రదేశ్‌లోని డిప్యూటీ కలెక్టర్‌ తాతా మోహన్‌రావు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు తీవ్రంగా శిక్షించింది. గుడిసెల తొలగింపు వ్యవహారంలో కోర్టు ధిక్కరణ కింద తహసీల్దార్‌ స్థాయికి డిమోట్ చేయాలని ఆదేశించింది. రూ.లక్ష జరిమానా విధించింది. మోహన్‌రావు ప్రభుత్వ భూమి రక్షణ కోసం చర్యలు తీసుకున్నట్లు వాదించారు.


ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న తాతా మోహన్‌రావును తహసీల్దార్‌ స్థాయికి డిమోట్‌ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2013లో తహసీల్దార్‌గా పనిచేస్తున్నప్పుడు ఆయన హైకోర్టు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులో గుడిసెలను తొలగించడాన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణనలోకి తీసుకొని ఈ వేటు వేసింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ ఏజీ మసీహ్‌లతో కూడిన బెంచ్‌ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.


కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు హైకోర్టు మోహన్‌రావుకు 2 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2015 మార్చి 27న తీర్పిచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ భూమిని రక్షించడానికే తాను చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నట్లు మోహన్‌ రావు కోర్టుకు వెల్లడించారు. ఏపీ విభజన ఉద్యమం జరుగుతున్న ఆ రోజుల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉండేవని, అందువల్ల కొందరు రాత్రికి రాత్రి వేసుకున్న గుడిసెలను మాత్రమే తొలగించామని చెప్పారు. అయితే హైకోర్టు తీర్పు ప్రకారం తాను 48 గంటలకు మించి జైల్లో ఉంటే ఉద్యోగం పోతుందని, దానివల్ల తన కుటుంబం రోడ్డున పడుతుందని, పిల్లల చదువులు దెబ్బతింటాయని మోహన్‌రావు కోర్టులో వాపోయారు.

దీంతో సుప్రీం కోర్టు, హైకోర్టు మోహన్‌రావుకు విధించిన శిక్షను సవరించి.. డిప్యూటీ కలెక్టర్‌ పదవి నుంచి తహసీల్దార్‌ పోస్టుకు డిమోట్‌ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆయన పేదల ఇళ్ల నిర్మాణం కోసం నాలుగు వారాల్లోపు రూ.లక్ష జరిమానా చెల్లించి, రసీదు కూడా కోర్టుకు సమర్పించాలి. తదుపరి పదోన్నతుల కోసం ఆయన సీనియారిటీని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’ అని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌గా పనిచేసేందుకు అంగీకరిస్తూ అండర్‌టేకింగ్‌ లెటర్‌ ఇవ్వాలని గత వాయిదాల్లోనే సూచించినా మోహన్‌రావు అంగీకరించకపోవడంతో జస్టిస్‌ గవాయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “పిటిషనర్‌ తొలిరోజే ఇందుకు అంగీకరిస్తే మేం 2, 3 ఇంక్రిమెంట్ల కోతతో ఆపేసేవాళ్లం. కానీ నాలుగు వాయిదాల వరకు తీసుకొచ్చారు. ఈ రోజు కూడా అంగీకరించకపోతే ఏ ప్రభుత్వం సాహసించలేని ఉత్తర్వులిచ్చేవాళ్లం.” న్యాయమూర్తి అన్నారు.

Also read

Related posts

Share this