SGSTV NEWS online
CrimeTelangana

చనిపోయిందని నమ్మించి శిశువు మాయం.. చివరికి వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం!


మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రసవానికి ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు ఆడ శిశువు జన్మించగా.. మృతి చెందిందని మాయమాటలు చెప్పి విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా.. సంబంధిత ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా ఫాతిమా సికింద్రాబాద్‌లోని మౌలాలిలో నివాసం ఉంటున్నారు. నస్రా ఫాతిమా ఏడు నెలల గర్భిణి కాగా, గత నెల 12న తల్లిగారింటికి వెళ్లేందుకు మెదక్ వచ్చారు. ఆ సమయంలో చేతిలో చిప్స్ ప్యాకెట్ ఉండటంతో కోతులు ఆమెపై దాడి చేయగా, కిందపడి రక్తస్రావమైంది. తన వెంట ఉన్న స్నేహితురాలు పర్వీన్ బేగం సాయంతో పట్టణంలోని లైఫ్ కేర్ ఆసుపత్రిలో చేరారు.


మరుసటి రోజు ఆసుపత్రిలో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేయగా ఆడపిల్లకు జన్మనిచ్చారు. అక్కడ పని చేస్తున్న అక్తరీ బేగం అనే నర్సు.. పాప పుట్టి చనిపోయిందని తల్లి నస్రా ఫాతిమాను నమ్మించి ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించి వేశారు. ఐదు రోజులకు నస్రా ఫాతిమా మెదక్‌కు రాగా, ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి, పాప చనిపోలేదని,బతికే ఉందని ఆమెతో చెప్పాడు. ఈ క్రమంలో నస్రా ఫాతిమా.. ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. భర్త అస్లాంఖాన్‌తో కలిసి మే నెల 3న మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఆసుపత్రి నర్సు అక్తరీ బేగం.. మెదక్ పట్టణంలోని గోల్కోండ వీధికి చెందిన నౌసిన్ ఉన్నిసాకు పసికందును అప్పగించినట్లు తేలింది. ఆమె సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాలుద్దీన్, సదీయ సుల్తానా దంపతులకు ఆడశిశువును లక్షా యాభై వేలకు విక్రయించినట్లు గుర్తించారు. లక్షా నలబై వేలు నర్సు తీసుకొని, 10 వేలు నౌసిన్ ఉన్నిసాకు ఇచ్చారు. పోలీసులు శిశువును సిద్దిపేట నుంచి తీసుకొచ్చి, మెదక్ సఖి కేంద్రంలో అప్పగించారు. నర్సుతో పాటు మధ్యవర్తి, పాపను కొనుగోలు చేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆసుపత్రి యజమాని పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కలెక్టర్ ప్రతిమాసింగ్ విచారణకు ఆదేశించారు.


జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆసుపత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సుల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని యాజమాన్యానికి సంబంధం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆస్పత్రి నిర్వాహకులు చెబుతున్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత బాధ్యులు, సహకరించిన వారిపైనా చర్యలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Also read

Related posts