SGSTV NEWS online
Andhra PradeshEntertainment

దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్.. పోలీసుల మైండ్ బ్లాక్ చేస్తున్న వింత చోరీ






విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో చోటుచేసుకున్న ఓ వింత చోరీ పోలీసులకు సవాల్‌గా మారింది. లావేరు రోడ్డులోని చికెన్ షాపుల్లో చొరబడిన ఓ దొంగ, కేవలం నగదును దోచుకోవడమే కాకుండా, పోలీసులను వెక్కిరిస్తూ అక్కడ కొన్ని ఆనవాళ్లను వదిలి వెళ్లాడు. ఈ చోరీ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు అభిరుచి చికెన్ షాపు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. షాపులో ఉన్న సుమారు రూ.2,500 నగదును అపహరించాడు. అనంతరం పక్కనే ఉన్న కేవీఆర్ చికెన్ దుకాణంలోకీ చొరబడ్డాడు. అయితే అక్కడ నగదు లేదా విలువైన వస్తువులు ఏమీ దొరకకపోవడంతో, నగదు కౌంటర్ వద్ద ఉన్న పుస్తకంపై పెన్సిల్‌తో ఒక వాహనం నంబరు రాశాడు.


అంతేకాకుండా దమ్ముంటే తనను పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసురుతూ ఒక ప్లేట్ పై రాసి వెళ్లాడు. అలా పోలీసులకు సవాలు విసరడం వల్ల దుండగుడు తన ధైర్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడా, లేక పోలీసులను తప్పుదోవ పట్టించాలనుకున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగ చేసిన ఈ హంగామా అంతా అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.



సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, దొంగను గుర్తించే పనిలో పడ్డారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదే అభిరుచి చికెన్ సెంటర్‌లో గత నెల 10న కూడా చోరీ జరిగింది. ఆ సమయంలో సుమారు రూ.32 వేల నగదు మాయమైంది. వరుసగా ఒకే షాపును లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతుండటంతో షాప్ యజమాని భయాందోళనకు గురవుతున్నాడు. ఈ ఘటనల పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, దొంగను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

Also read

Related posts