విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై నార్కొటిక్ కంట్రోల్ బృందం చేపట్టిన తనిఖీలలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం నుంచి విజయనగరం వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అధికారులు అర్ధరాత్రి సమయంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా నుంచి ఏపీలోకి అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠాకు నార్కోటిక్ టీమ్ చెక్ పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు జాతీయ రహదారిపై ప్రత్యేక తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా వస్తున్న ఓ బొలెరో వాహనాన్ని ఆపి పరిశీలించారు. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో కూరగాయల బుట్టలు, ముఖ్యంగా కేబేజీ బుట్టల మాటున గంజాయి ప్యాకెట్లను దాచినట్టు గుర్తించారు. మొత్తం 650 కిలోల గంజాయి, అంటే 123 ప్యాకెట్లు వాహనంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
గంజాయి రవాణాను కూరగాయల సరుకు పేరుతో కప్పిపుచ్చి తరలిస్తున్నట్టు నార్కొటిక్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ గంజాయి ఒడిశా ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది. అధికారులు వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బొలెరో వాహనం మరియు స్వాధీనం చేసుకున్న గంజాయిని బొండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గంజాయి రవాణా వెనుక ఉన్న ముఠా గురించి వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నార్కొటిక్ కంట్రోల్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్పై దర్యాప్తు ముమ్మరం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ను విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





