SGSTV NEWS
Andhra PradeshCrime

TTD: టీటీడీలో కలకలం.. శ్రీ శ్రీనివాస కళార్చన పేరిట మోసం… టీటీడీ విజిలెన్స్ అదుపులో నిర్వాహకుడు ?


తిరుమలలో నృత్యకళాకారులతో  కళార్చన, అరంగేట్రం కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ ఒక నిర్వాహకుడు కళాకారుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలో ‘శ్రీ శ్రీనివాస కళార్చన’ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పి కళాకారులను మోసగించాడు

TTDevasthanams : తిరుమలలో నృత్యకళాకారులతో  కళార్చన, అరంగేట్రం కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ ఒక నిర్వాహకుడు కళాకారుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం, తెలంగాణ ఖాజీపేటకు చెందిన అభిషేక్ అనే వ్యక్తి ‘అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ’ మరియు ‘అన్నమయ్య సాహితీ కళా వికాస పరిషత్’ అనే పేర్లతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. తిరుమలలో ‘శ్రీ శ్రీనివాస కళార్చన’ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పి కళాకారులను మోసగించాడు.ఈ సంస్థ ద్వారా ‘శ్రీ శ్రీనివాస కళార్చన’ పేరిట తిరుమలలోని ఆస్థాన మండపంలో నృత్యప్రదర్శనలు, అరంగేట్రాలు, కళాప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పి, దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల నుంచి ఒక్కొక్కరిగా రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేశాడు. ఆయా ప్రదర్శనల సమయం, తేదీని నిర్ధారిస్తూ వారికి గుర్తింపు కార్డు, లేఖలు జారీ చేశాడు.


ఈనెల 21న టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ వద్ద ప్రదర్శనలకు అనుమతి తీసుకున్నా, అభిషేక్ డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీకి ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలతో అనుమతిని టీటీడీ రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని అభిషేక్ హైకోర్టులో సవాలు చేశాడు. కార్యక్రమం ముందే నిర్ణయించబడినదిగా పరిగణించి,కోర్టు టీటీడీని 27, 28 తేదీల్లో రోజుకు 600 మందికి చొప్పున 1200 మందికి ప్రదర్శనకు అనుమతించాలని ఆదేశాలిచ్చింది. టీటీడీ తరపు న్యాయవాదులు అభిషేక్ డబ్బులు వసూలు చేశాడని న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు.అయితే అభిషేక్ దాదాపు 2 వేల మందికి పైగా కళాకారులకు ఆహ్వానం పంపడంతో తిరుమల ఆస్థాన మండపం వద్ద గందరగోళం నెలకొంది. అనుమతించని కళాకారులను బయట నిలిపేయడంతో వారు నిరసనకు దిగారు. 

వెంటనే విజిలెన్స్, పోలీసు అధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారులకు నివేదించారు. అధికారుల ఆదేశాలతో మిగిలిన కళాకారులను కూడా ప్రదర్శనకు అనుమతించారు. బాధితుల ఫిర్యాదుతో నిర్వాహకుడిని టీటీడీ విజిలెన్స్ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తోంది.. దీంతో నిర్వాహకుడిపై నాలుగు వారాల్లో విజిలెన్స్ శాఖ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Also read

Related posts

Share this