రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ భయాలు ఉన్నవేళ మాంసాహారులు… ముఖ్యంగా చికెన్ ప్రియులు భయపడుతున్నారు. ఫ్లూ భయంతో చికెన్ తినేందుకు చాలామంది వెనకాడుతూ ఉండటంతో.. నెమలి మాంసం అయితే కాస్త ఎక్కువ రేటు పెట్టి అయినా తీసుకుంటారని ఓ వ్కక్తి భావించాడు. జాతీయ పక్షి నెమలి మాంసాన్ని అమ్మేందుకు ప్రయత్నించాడు. విషయం బయటకు పొక్కి పోలీసులు, అటవీ సిబ్బంది వద్దకు చేరి కటకటాల పాలయ్యాడు.
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంకు చెందిన నిమ్మల రమేష్.. వృత్తిలో భాగంగా జంతువులు పక్షులను వేటాడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి గత కొంతకాలంగా జాతీయ పక్షి నెమలి మాంసంతో పాటు వివిధ రకాల వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం పోలీసులకు దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులు, అటవీ శాఖ సిబ్బందితో కలిసి విక్రయ స్థావరంపై దాడి చేశారు. అక్కడ చనిపోయిన రెండు నెమలులు, సుమారు కేజీ మాంసంతో ప్యాక్ చేసిన పది ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్యాకెట్లలో ఉన్న మాంసం ఏ జంతువుకు చెందినదో తెలుసుకునేందుకు హైదరాబాద్ ల్యాబ్కు పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. శెట్టి పాలెంలో విక్రయిస్తున్న మాంసం ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఇందులో ఎంతమంది పాత్ర ఉంది అనే అంశంపై పోలీసులు, అటవీ సిబ్బంది అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.వెంకటేశ్వర్లు తెలిపారు. వన్యప్రాణులను, జాతీయ పక్షులు, జంతువులను చంపడం నేరం. వాటిని అక్రమ రవాణా చేసినా..వండుకుని తిన్నా తీవ్రమైన సెక్షన్లతో కూడిన కేసులను ఎదుర్కొవాల్సి ఉంటుంది
Also read
- కొడుకుతో కలిసి.. ప్రియుడిని హతమార్చిన మహిళ
- ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన అన్నదాత
- ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!
- నిశ్చితార్థమయ్యింది.. కానీ ..!
- అధిక మాసం రహస్యాలు.. జ్యేష్ఠ మాసంలో తప్పక చేయాల్సిన పూజలు, నియమాలు..





