July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: బీదర్‌లో హైదరాబాద్‌ బిల్డర్‌ దారుణ హత్య! తలపై బండరాయితోమోది.. కత్తులతో పొడిచి..

హైదరాబాద్‌, మే 28: హైదరాబాద్‌కు చెందిన ఓ బిల్డర్‌ కర్ణాటకలోని బీదర్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రహదారిపై మూసి ఉన్న దాబా పక్కన నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. ఈ ఘటనపై కర్ణాటకలోని మన్నేకెళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం..

హైదరాబాద్‌లోని జీడిమెట్లలోని కల్పన సొసైటీలో కుప్పాల మధు(48) అనే బిల్డర్‌ నివసిస్తున్నాడు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, కుమార్తెలు అలేఖ్య, అఖిల ఉన్నారు. మధు బిల్డర్‌గానే కాకుండా ట్రావెల్స్‌ వ్యాపారం కూడా ఉంది. మధు వ్యాపారం నిమిత్తం తరచూ బీదర్‌కు వెళ్తుండేవాడు. మే 24న బీదర్‌ వెళ్లిన మధు తనతోపాటు స్నేహితుడు రేణుక ప్రసాద్‌(32), వరుణ్, లిఖిత్‌ సిద్దార్థరెడ్డిలను కూడా తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి 10 గంటలకు భార్య ఫోన్‌ చేయగా హైదరాబాద్‌ వస్తున్నట్లు మధు చెప్పాడు. అయితే గంట తర్వాత మధుకు ఆయన భార్య మళ్లీ ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ రావడంతో భార్య వెంకట లక్ష్మి కంగారు పడింది. కర్నాటకలోని బీదర్‌ జిల్లాలో మన్నేకెళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆ మరుసటి రోజు అంటే మే25న ఉదయం రోడ్డు పక్కన ఉన్న కారు వద్ద మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కారు నంబరు ఆధారంగా మృతుడిని మధుగా గుర్తించారు. అనంతరం వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కర్ణాటకలోని మన్నాఖల్లి పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ డి శైలజ డెక్కన్ క్రానికల్‌తో మాట్లాడుతూ.. శనివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం గురించి మాకు కాల్ వచ్చింది. ఆ ప్రాంతంలోని CCTV ఫుటేజీలో నలుగురు వ్యక్తులు అతని మృతదేహాన్ని నిర్జన ప్రదేశంలో పడేసినట్లు కనిపించింది. వాళ్లు మధుని వేరే చోట హత్య చేసి అక్కడ పడవేసి ఉండవచ్చు. మధుని పెద్ద బండరాయితో తలపై కొట్టి, ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపినట్లు మన్నేళ్లి పోలీసులు గుర్తించారు. పైగా మధు ఒంటిపై ఉన్న రూ.6 లక్షల విలువైన బంగారాభరణాలతోపాటు కారులో ఉన్న నగదును దోచుకుని నిందితులు పరారయ్యారు. మరోవైపు జీడిమెట్ల పోలీసులకు మధు హత్యపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని అధికారులు తెలిపారు. దీంతో ఈ హత్య వెనుక కుటుంబ సభ్యుల హస్తం ఉందా లేదా అతనితోపాటు వెళ్లిన ముగ్గురు స్నేహితులతో కుటుంబ సభ్యులు బేరసారాలు జరిపి హత్య చేయించి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via