ఎప్పుడో 60, 70 యేళ్లకు పలకరించవల్సిన గుండె పోట్లు పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారి మొగ్గలకు రావడం కలవరం పెడుతుంది. రెండు వారాల క్రితం ఓ బాలిక గుండెపోటుతో ఉన్నట్లుండి కుప్పకూలి మరణించింది. ఇంతలో మరో బాలిక బలైంది. ఇవన్నీ ఒకే జిల్లాలో జరగడంతో అసలక్కడ ఏం జరుగుతుందో తెలియక కలవరపడుతున్నారు..
మంచిర్యాల, నవంబర్ 29: ఆడుతూ.. పాడుతూ గడపాల్సిన వయసు.. కష్టమంటే ఏంటో కూడా తెలియని పసితనం. అప్పటిదాకా కుటుంబ సభ్యుల ఎదుట ఉల్లాసంగా కనిపించిన పిల్లలు.. ఒక్కసారిగా పిట్టల్లా రాలి పోతున్నారు. మంచిర్యాల జిల్లా ఇప్పుడు వరుస గుండెపోటు మరణాలతో ఆందోళన చెందుతోంది. అందులోను పట్టుమని పదేళ్లుకూడా నిండని చిన్నారుల గుండెలు హఠాత్తుగా ఆగిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మొన్న చిన్నారి నివృత.. నేడు చిన్నారి సమన్విత.. ఇద్దరివి పట్టుమని పదేళ్లు కూడా నిండని వయసే. అంతలోనే నూరేళ్లు నింపుకుని కన్న వాళ్లకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి సెలవంటూ వెళ్లిపోతున్నారు. చిన్నారుల ఆయుష్షు గుండెపోట్లతో బేజారవుతోందనడానికి ఈ వరుస ఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా క్షణాల్లో ప్రాణాలను గాల్లో కలిపేస్తోంది ఈ మాయదారి హృదయ రోగం.
తాజాగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన పదేళ్ల చిన్నారి దిగుట్ల సమన్విత గుండెపోటుతో మృతి చెందింది. ఉదయం స్కూల్ కు వెళ్లేందుకు రెడీ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుర్తించిన తండ్రి నాగరాజు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ప్రాణాలు మాత్రం నిలపలేకపోయారు. మధ్యాహ్నం గుండెపోటుతో చిన్నారి మృతిచెందిందని వైద్యులు ధృవికరించడంతో.. కన్నోళ్లు గుండెలు పగిలేలా రోధించారు. తల్లి అనుషా కల్లెదుటే చిన్నారి సమన్విత ఆఖరి శ్వాస వదలడంతో ఆ తల్లిగుండె తట్టుకోలేక పోయింది. ఈ విషాద వార్త విన్న రోటిగూడ గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. పదేళ్లకే నూరేళ్లు నిండాయా తల్లి.. అంటూ కుటుంబ సభ్యులు వెక్కివెక్కి ఏడ్చారు. చిన్నారి సమన్విత లక్షేట్టిపేట మండలం కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూల్ లో నాలుగవ తరగతి చదువుతున్నట్టు సమాచారం.
కాగా సరిగ్గా రెండు వారాల క్రితం ఇదే మంచిర్యాల జిల్లాలో చెన్నూరు పట్టణం పద్మనగర్ కాలనీకి చెందిన పన్నెండేళ్ళ కస్తూరి నివృతి (12) బాలిక గుండెపోటుతో మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపగా.. తాజాగా సమన్విత ఘటనతో మంచిర్యాల జిల్లాలో ఆందోళన నెలకొంది. అల్లారుముద్దుగా అడుతూ, పాడుతూ ఉండే చిన్నారులు.. కన్న వాళ్ల కండ్లముందే హఠాత్తుగా కుప్పకూలి పోయి తిరిగి రాని లోకాలకు చేరుతుండటం కన్నవారిని కోలుకోకుండా చేస్తోంది
Also read
- శనైశ్చరి అమావాస్య: ఒక్క పని చేస్తే చాలు.. శని దోషాలు పోయి, లక్ డైరెక్ట్గా ఇంటికే వస్తుంది!
- గరుడ పురాణంలో పేర్కొన్న పాపులకు 28 ఘోరమైన శిక్షలు
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- పామర్రు వివాహిత హత్య కేసు.. 24 గంటల్లో నిందితులను పట్టుకున్న పోలీసులు..
- ఒత్తిడి తట్టుకోలేక జూనియర్ వైద్యుడి ఆత్మహత్యాయత్నం





