SGSTV NEWS online
Crime

ఇన్వర్టర్ నుంచి విద్యుత్తు సరఫరా..స్తంభంపైనే ప్రాణాలొదిలిన కార్మికుడు



ఆదిలాబాద్ : ఉపాధి కోసం ఎన్నో రాష్ట్రాలు దాటి వలస వచ్చిన కార్మికుడు.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలైన విషాద ఘటన ఆదిలాబాద్లో శనివారం చోటుచేసుకుంది. వన్డేన్ ఇన్స్పెక్టర్ బి. సునీల్ కుమార్, విద్యుత్తుశాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఝార్ఖండ్కు చెందిన యాదవ్ సురేష్ (24) ఆదిలాబాద్ పట్టణంలో ఓ గుత్తేదారు దగ్గర పనులు చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం రాణిసతీజీ కాలనీలో విద్యుత్తు స్తంభంపై తీగలు సరిచేయటానికి స్తంభం ఎక్కాడు. అంతకుముందే ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కానీ ఓ ఇంటి ఇన్వర్టర్ నుంచి తను సరి చేస్తున్న తీగలకు విద్యుత్తు సరఫరా అయింది. ఆ విషయం తెలియక తీగలు సరి చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే ప్రాణాలు విడిచాడు. సహచర కార్మికులు మృతదేహాన్ని కిందికి దింపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Also read

Related posts