SGSTV NEWS
Andhra PradeshViral

ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది – షాకింగ్ ఫ్యాక్ట్స్!


ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు. 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారు. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు.

పాకిస్తాన్.. ఈ పేరు వింటే చాలా మంది భారతీయులు కట్టలు తెంచుకుంటారు. అయితే మరి అలాంటి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ కాలనీ ఉందని మీకు తెలుసా?. అవును మీరు విన్నది నిజమే. ఏపీలోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ అనే ప్రాంతం ఉంది. అక్కడ ఎంతో మంది జీవిస్తున్నారు కూడా. అది విజయవాడ సిటీ కార్పొరేషన్‌ పరిధిలోని 62వ డివిజన్‌లో ఉంది.

అక్కడ ఉండే ప్రజల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్స్ సహా అన్నింటిలోనూ వారి అడ్రస్ పాకిస్తాన్ కాలనీ, బెజవాడగా ఉంటుంది. అయితే మరి ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది?.. అక్కడ పాకిస్తానీలు జీవిస్తున్నారా?, ఒకవేళ వారు జీవించకపోతే అక్కడునున్న వారు ఈ పేరు వల్ల ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా? లేదా? అనేది పూర్తిగా తెలుసుకుందాం.

1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు
అప్పట్లో 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారని.. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారని ఆ ప్రాంత కార్పొరేటర్‌గా గతంలో పనిచేసిన ఓ వ్యక్తి తెలిపారు. అంతేకాకుండా అక్కడ బర్మా కాలనీ కూడా ఉందని పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్ కాలనీలో నివశిస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. అక్కడ పాకిస్తాన్ వాళ్ల కోసం ఆ కాలనీ కట్టారని.. వాళ్లు బట్టల వ్యాపారం చేసేవారని.. అయితే అమ్మకాలు సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారని తెలిపారు.

ఎక్కడ నుంచి వచ్చారంటే?
1971లో తూర్పు పాకిస్తాన్ (ఈస్ట్ బెంగాల్), పాకిస్తాన్‌ మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అప్పట్లో భారత్.. ఈస్ట్ బెంగాల్ తరపున పోరాడింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. ఆ సమయంలోనే ఎన్నో లక్షల మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చారు. వారికి ఆశ్రయం ఇచ్చి, శిబిరాలు ఏర్పాటు చేసింది భారత్.

అయితే ఇప్పుడు మాత్రం ఆ పాకిస్తానీ కాలనీ ప్రాంతంలో శరణార్థులు ఎవరూ లేరని స్థానిక ప్రజలు చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లు కొద్ది రోజులు మాత్రమే ఉన్నారని.. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయారని తెలిపారు. అయితే అప్పట్లో బెజవాడకు ఈ ప్రాంతం చాలా శివారులో ఉండేది. అంతేకాకుండా కరెంటు సరిగా ఉండేది కాదు, రోడ్లు ఉండేవి కావు, ఇళ్లు కూడా సరిగా లేకపోవడం ఒక కారణం. అలాగే బుడమేరుకి అప్పట్లో భారీ వరద రావడంతో ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయింది. దీంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.


పాకిస్తాన్ కాలనీ వల్ల ఇబ్బందులు

ప్రస్తుతం ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు.. పాకిస్తాన్ కాలనీ పేరు వల్ల చాలా ఇబ్బందుల పడుతున్నామని చెబుతున్నారు. కొందరు పీజీలు పూర్తి చేసి విదేశాలకు వెళ్లాలనుకుంటే పాస్ పోర్ట్ ఆఫీసులో పాకిస్తాన్ కాలనీ పేరు చూసి చాలా ప్రశ్నలు అడుగుతున్నట్లు ఆ ప్రాంత యువత చెబుతుంది. అలాగే ఉద్యోగాల కోసం వెళ్లినపుడు కూడా ఇంటర్వ్యూలలో ఆ పేరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.

పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
ఆ కాలనీ ప్రజల సమస్యను ఏపీ ప్రభుత్వం పరిష్కరించింది. ఈ మేరకు ఆ కాలనీకి మరో పేరును పెట్టింది. భగీరథ కాలనీగా కొత్త పేరును నామకరణం చేసింది. అదే సమయంలో స్థానికుల చిరునామాను (అడ్రస్) మార్చినట్లు జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రకటించారు. దీంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Also read

Related posts

Share this