SGSTV NEWS
CrimeTelangana

Hyderabad Crime : మాయమాటలతో పెళ్లి…కోట్లు దండుకొని భర్తకు నరకం


మాయమాటలతో ఒక వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా కోట్లాది రూపాయలు కొట్టేసి భర్తను బెదిరిస్తూ నరకం చూపేడుతున్న ఓ కిలాడీ బాగోతం బట్టబయలైంది. తనకు అన్యాయం జరిగిందని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే వారు కూడా పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.

Hyderabad crime : ఇన్నాళ్లు మగవాళ్ల చేతిలో మోసపోయిన ఆడవాళ్లను మాత్రమే చూశాం. కానీ కాలం మారింది. మోసానికి ఆడ, మగ తేడా లేదని నిరూపితమవుతోంది. ఒకటని కాదు అనేక సంఘటనలు ఈ విషయాన్ని దృవీకరిస్తున్నాయి. తాజాగా మాయమాటలతో ఒక వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా కోట్లాది రూపాయలు కొట్టేసి భర్తను బెదిరిస్తూ నరకం చూపేడుతున్న ఓ కిలాడీ బాగోతం బట్టబయలైంది. అంతేకాదు తనకు అన్యాయం జరిగింది మొర్రో అని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే  పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో సదరు వ్యక్తి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో దిగొచ్చిన ఫిలింనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి


టోలిచౌకిలోని సబ్జా కాలనీలో నివాసం ఉండే సయ్యద్‌ హుస్సేన్‌ వ్యాపారవేత్త. ఆయనకు 2021 నవంబర్‌లో జమీలా రవికుమార్‌ అనే మహిళతో ఒక మ్యాట్రిమోనీలో పరిచయమైంది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. తనకు గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మైహోమ్‌ విహంగలో విల్లా ఉందని, తనకు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయని నమ్మించింది. అంతేగాక ఫిల్మ్‌నగర్‌లో నివసించే తన తల్లి రత్న రవికుమార్‌ను కూడ  హుస్సేన్‌కు  పరిచయం చేయడంతో పూర్తిగా నమ్మేశాడు. తమకు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయని, తనకొక బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని, ఆయన పేరు రేధా ముస్సా ఇస్మాయిల్‌ అహ్మద్‌అని చెప్పింది. తనతో కొన్ని గొడవల కారణంగా దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. 

వారి స్నేహం ఇలా కొనసాగుతున్న క్రమంలోనే  ఒకసారి వ్యాపార విషయాలు తీసుకొచ్చింది. సయ్యద్‌ హుస్సేన్‌తో కలిసి తను వ్యాపారం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. తనకు సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలున్నాయని ఇద్దరం కలసి వ్యాపారం చేస్తే రాణించవచ్చని నమ్మించింది. అయితే సయ్యద్‌ అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో తనను వివాహం చేసుకోవాలని కోరింది. అతను అంగీకరించకపోవడంతో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి మాయమాటలతో అతన్ని వివాహం చేసుకొంది. కొంతకాలం సాఫీగానే సాగినా తరువాత తన అసలు రూపం బయటపెట్టింది. తల్లీకూతుళ్లిద్దరూ సయ్యద్‌ను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. అతని వ్యాపార వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతోపాటు దాదాపు రూ.కోటికిపైగా నగదు ఖర్చు చేశారు. అతని ఐఫోన్‌ నుంచి తెలియకుండా మరో రూ.80 లక్షలను తమ ఖాతాలో జమ చేసుకున్నారు. సయ్యద్‌ ను బెదిరించి మరో నాలుగు కోట్ల వరకు గుంజారు. తల్లీకూతుళ్ల మాటలపై అనుమానం వచ్చిన సయ్యద్‌ హుస్సేన్, వీరి పూర్వ స్థితిపై ఎంక్వయిరీ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆయనకు మైండ్‌ బ్లాకయ్యే వివరాలు తెలిశాయి. జమీలాకు ఇమ్రాన్‌ ఖాన్‌ అనే వ్యక్తితో పెళ్లయిందని, వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తేలింది.


ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో జమీలా తాము ఉంటున్న ఇంటికి సయ్యద్‌ను రాకుండా నిరోధించారు.తనవద్ద దోచుకున్న డబ్బులతో విదేశాలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. తను మోసపోయానని గ్రహించిన సయ్యద్‌ ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎన్నిసార్లు పోలీసులకు తన గోడు వెళ్లబోసుకున్న ఫలితం లేకపోవడంతో  కోర్టును ఆశ్రయించాడు. వారు పారిపోయే అవకాశం ఉందని వారి పాస్‌పోర్ట్, వీసాలను నిలిపివేసి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరాడు. దీంతో న్యాయస్థానం ఆదేశాలతో ఫిలింనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు

Also read

Related posts

Share this