SGSTV NEWS
CrimeTelangana

చేపల కూర కోసం యువకుడ్ని హత్య చేసిన స్నేహితులు!


నాగోల్‌లో చేపల కూర కోసం జరిగిన గొడవలో దేవీరామ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ముగ్గురు స్నేహితులు మద్యం సేవించిన అనంతరం కూర విషయంలో వివాదం తలెత్తగా.. ఆగ్రహానికి గురైన ముఖేశ్ కత్తితో దాడి చేయగా..దేవీరామ్ మృతిచెందాడు.

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకే మనుషులు తాము మనుషులమనే విషయాన్నే మరిచిపోతున్నారు. ఆవేశంలో దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. అటువంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్ నాగోల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. చేపల కూర ఓ యువకుడి మృతికి కారణమైంది. అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

నాగోలు పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ మత్తుగూడ సమీపంలోని కుత్బుల్లాపూర్‌కు చెందిన వెంకటేశ్ యాదవ్ అనే వ్యక్తి వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవీరామ్‌ (24) గత నాలుగేళ్లుగా అక్కడ పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం అతడు తన సొంత రాష్ట్రానికి చెందిన ముఖేశ్ కుమార్, యోగేశ్ కుమార్‌లను కూడా పనికి తీసుకొచ్చాడు. వాటర్ ఫ్లాంట్‌లోనే వారికి పని ఇప్పించాడు.

అక్కడే ఓ గది ఉండగా అందులోనే ఉంటున్నారు. అయితే ఈనెల 21న రాత్రి ముగ్గురు కలిసి మద్యం సేవించి గదికి చేరుకున్నారు. ముందుగా వచ్చిన దేవీరామ్‌ మిగతావారికి వండిన చేపల కూరను తినేసి, మిగిలినంతను వీధి శునకాలకు వేసాడు.గదికి ఆలస్యంగా వచ్చిన ముఖేశ్, యోగేశ్‌ చేపల కూర ఏదని దేవీరామ్‌ను ప్రశ్నించారు. వారి ప్రశ్నకు దేవీరామ్‌ అహంకారంగా సమాధానమిచ్చాడు. ఈ వివాదం ముదిరి గొడవకు దారి తీసింది. విచక్షణ కోల్పోయిన ముఖేశ్ కుమార్ కూరగాయలు కోసే కత్తితో దేవీరామ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు.

గాయాలతో రోడ్డుపై కుప్పకూలిన దేవీరామ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అతడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. చేపల కూర కోసం హత్య చేయటమేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Also read

Related posts

Share this