ఆస్తి తగాదాలే కారణమన్న పోలీసులు
చిలకలగూడ (హైదరాబాద్): ఆస్తి తగాదాల నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్న అత్తపై కూరగాయలు కోసే కత్తితో కోడలు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… చిలకలగూడ ఎరుకలబస్తీకి చెందిన దేవరాయ పద్మావతి (57)కి కోడలు విజయలక్ష్మికి మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో మనస్పర్ధలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచూ ఇరువురి మధ్య తగాదాలు జరుగుతున్నాయి. పద్మావతి భర్త ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందారు.
మొదటి అంతస్తులో అత్త పద్మావతి ఒంటరిగా ఉండగా, గ్రౌండ్ ఫ్లోర్లో కుమారుడు, కోడలు విజయలక్ష్మి ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఫస్ట్ఫర్ను కుమార్తెకి రాసిస్తానని పద్మావతి చెప్పడంతో నాలుగేళ్లుగా అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 21వ తేదీన వివాదం తీవ్రమై అత్తను ఇంట్లోకి ఈడ్చుకెళ్లిన కోడలు కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు, చేతులపై దాడి చేసింది.
పద్మావతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో పడున్న ఆమెను హుటాహుటిన గాం«దీఆస్పత్రికి తరలించారు. కోడలు అత్తపై దాడి చేస్తున్న దృశ్యాలు ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విజయలక్ష్మిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వైద్యసేవల అనంతరం అత్త పద్మావతి కోలుకుంటున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు.
Also read
- రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్కు తీసుకెళ్లగా..
- అకారణంగా ఉద్యోగం తొలగించారంటూ టెక్ మహీంద్రపై మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు
- అర్ధరాత్రి వృద్ధులపై దాడిచేసి దోపిడీ
- నెలక్రితం ఆమె తలలో దిగింది బుల్లెట్టే..!
- కలకలం రేపిన సగం కాలిన మృతదేహం..





