ఆడుకుంటూ ఉయ్యాల ఊగాల్సిన వయసు.. ఆనందంగా గడవాల్సిన బాల్యం.. కానీ విధి చిన్నారి జీవితంతో విషాదకరంగా ఆటలాడింది. ఉయ్యాల కట్టేందుకు ఉపయోగించిన చీరే ఉరితాడుగా మారి ఓ బాలిక ప్రాణాలను బలి తీసుకుంది. అల్లరి ముద్దుగా పెంచుకున్న ఆ ఇంటి దీపం ఆరిపోయింది. ఈ హృదయ విదారక ఘటన ఎక్కడ చేసుకుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కప్రాయపల్లి గ్రామానికి చెందిన పుడుత శంకర్, మమత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ దంపతులు తమ పిల్లలను ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. వేసవి సెలవులు కావడం వద్ద పిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే రెండో కుమార్తె తేజశ్రీ (11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తమ్ముడు, చెల్లి బయటికి వెళ్ళగా తేజశ్రీ ఇంట్లోనే ఆడుకుంటుంది. ఇంటికి మూడు గదులు ఉండగా మధ్య గదిలో సీలింగ్ రాడ్డుకు చీరతో ఉయ్యాల కట్టుకొని ఊగుతోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చీర మెలిక తిరిగి మెడ భాగంలో చుట్టుకుపోయింది. ఇంటి ముందు పనిచేస్తున్న తల్లి మమతకు.. కూతురు తేజశ్రీ అలికిడి వినిపించలేదు. దీంతో తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా, అపస్మారకస్థితిలో ఉన్న కూతురిని చూసి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి బాలికను కాపాడేందుకు బీబీనగర్ ఎయిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో బాలిక మృతి చెందింది.
ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదం తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచెత్తింది. చిన్నారి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలోనూ విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Hyderabad: పాత కక్షతో చోరీ.. రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- మృత్యుపాశంగా మారిన ఉయ్యాల చీర..
- నువ్వేం తల్లివమ్మా.. అప్పుడే పుట్టిన బిడ్డను హాస్పిటల్ వెనకాల వదిలేసి వెళ్లిన మహిళ!
- అమ్మాయి పిలించిందని ఆశగా వెళ్లాడు.. కట్ చేస్తే, సినిమాలకు మించిన ట్విస్ట్..
- Crime News:ప్రేమ పెళ్లి నెలకే విషాదం.. అత్తింటి వేధింపులతో యువతి ఆత్మహత్య





