హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖ మరో భారీ తిమింగలాన్ని పట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ నివాసాలపై జరిగిన దాడులు ఇప్పుడు నగరంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సోదాల్లో భారీ నగదుతోపాటు కీలక డాక్యుమెంట్స్ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ప్రాజెక్ట్ డివిజన్-8 రెడ్ హిల్స్లో జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్)గా పనిచేస్తున్న ఎస్. అనంత లక్ష్మి కుమార్ లక్ష్యంగా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. కుమార్ తన పదవిని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు.
మంగళవారం (మే 19) తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని మల్లాపూర్, వెంకటరమణ కాలనీలోని కుమార్ నివాసంతో పాటు, ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.
తనిఖీల సమయంలో కుమార్ ఇంట్లో లభించిన నగదు చూసి అధికారులు విస్తుపోయారు. కేవలం ఆయన నివాసంలోనే సుమారు 1 కోటి రూపాయల నగదు లభ్యమైనట్లు సమాచారం. బీరువాల్లో కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలను లెక్కించడానికి అధికారులు ప్రత్యేకంగా కౌంటింగ్ మెషీన్లను తెప్పించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నగదుతో పాటు పలు చోట్ల ఉన్న భూములు, ప్లాట్లు, విలువైన బంగారు ఆభరణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. బంధువుల ఇళ్లలో లభించే ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అక్రమ ఆస్తుల విలువ మరిన్ని కోట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువపై ఏసీబీ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. విధుల్లో ఉండి అక్రమ మార్గాల్లో కోట్లు గడించిన ఈ అధికారి బాగోతం ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also read
- విశాఖ షీలానగర్లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?





