SGSTV NEWS online
Andhra PradeshCrime

సైబర్ మాయాజాలం.. క్లిక్ చేస్తే కైలాసమే.. అప్రమత్తతే అసలైన కవచం!





టెక్నాలజీ పెరిగేకొద్దీ మనిషి జీవితం సులభతరమవుతోంది కానీ, అదే టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సామాన్యుల కష్టార్జితాన్ని నిలువునా దోచేస్తున్నారు. పోలీసులు, అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా, మీడియా ఎంతగా హెచ్చరిస్తున్నా.. అమాయకత్వం, అత్యాశ లేదా అజాగ్రత్త వల్ల నిత్యం ఎవరో ఒకరు సైబర్ దొంగల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు.

తాజాగా నెల్లూరు నగరంలోని నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. నితీష్ అనే పేరుతో పరిచయమైన ఒక అపరిచిత వ్యక్తి, “సేవింగ్స్ ఆన్‌లైన్ మార్కెటింగ్” పేరుతో ఒక యువతికి వాట్సాప్ ద్వారా APK (Android Package Kit) ఫైల్ లింక్‌ను పంపాడు. ఆ లింక్ వెనుక ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయిన ఆ యువతి, దాన్ని ఓపెన్ చేయగానే క్షణాల్లో ఆమె బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోయింది. ఏకంగా రూ. 2.58 లక్షలు మాయం కావడంతో ఆ యువతి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు పాత పద్ధతులను వదిలేసి, సమాజంలో జరుగుతున్న పరిణామాలను యుద్ధాలు, గ్యాస్ డెలివరీ, ప్రభుత్వ పథకాలు ఆసరాగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా APK ఫైల్స్ పంపిస్తూ దోచేస్తున్నారు. ఇవి మొబైల్‌లో ఇన్‌స్టాల్ అవ్వగానే మీ ఫోన్ నియంత్రణను హ్యాకర్ల చేతుల్లోకి తీసుకెళ్తాయి.అలాగే, గ్యాస్ సబ్సిడీ అనో, కేవైసీ అప్‌డేట్ అనో చెప్పి మీ రహస్య కోడ్‌లను లాగేస్తారు. అలాగే, అకౌంట్ బ్లాక్ అవుతుందని భయపెట్టడం లేదా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ ఆశ చూపడం వీరి ప్రధాన ఆయుధాలుగా మారిపోయాయి.

ఈ నేపథ్యంలోనే “గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయకండి, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయకండి” అని పోలీసులు మొత్తుకుంటున్నా ప్రజల్లో ఆశించిన మార్పు రావడం లేదు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి. మొదటి రెండు గంటలు (Golden Hours) చాలా కీలకం. మన స్మార్ట్‌ఫోన్ మన చేతుల్లోనే ఉన్నా, మన అజాగ్రత్త వల్ల అది నేరగాళ్ల అడ్డాగా మారకూడదు. డిజిటల్ ప్రపంచంలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండటమే మనకు శ్రీరామరక్ష.

Also read

Related posts