గుంటూరులో వరుసగా జరుగుతున్న విద్యుత్ అంతరాయాల వెనుక సంచలన కారణం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వేళల్లో ఐరన్ తీగలకు రాళ్లు కట్టి విద్యుత్ లైన్లపై విసరడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. ముస్లిం కాలేజ్, పెదకాకాని, రామిరెడ్డి తోట ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలపై విద్యుత్ శాఖ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.
గుంటూరు నగరంలోని ముస్లిం కాలేజ్ ప్రాంతం.. 33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడటంతో స్థానికుల నుండి వరుస పోన్లు వచ్చాయి. అర్ధరాత్రి సమయంలో పెదకాకాని పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడటంతో వరుసగా ఫోన్లు వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సిబ్బంది హుటాహుటిన ఆ సబ్ స్టేషన్ పరిధిలో ఎక్కడ సమస్య వచ్చింది చూసి వెంటనే పరిష్కరించారు. ఇదే తరహాలో వారం రోజుల క్రితం రామిరెడ్డి తోట పరిధిలో కూడా అర్థరాత్రి సమయంలో పవర్ నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఇలా వరుసగా జరగటంతో విద్యుత్ శాఖాధికారులు ఆలోచనలో పడ్డారు. అసలు ఏంజరిగి ఉంటుందా అని లైన్లు పరిశీలించారు. వర్షం లేదు, ఈదురు గాలులు లేవు అయినా ఎందుకు అంతరాయం వస్తుందో పరిశీలించిన అధికారులకు ఆశ్చర్యపోయే పరికరాలు కొన్ని కనిపించాయి.
పొడవాటి తీగలకు రాళ్లు లేదా ఇతర వస్తువులను కట్టిన గంజాయి బ్యాచ్ లు అర్ధరాత్రి సమయంలో వాటిని విద్యుత్ లైన్ల పైకి విసురుతున్నట్లు గుర్తించారు. ఐరన్ తీగలకు రాళ్లు కట్టి విసరడంతో అవి సులభంగా విద్యుత్ వైర్లపై పడుతున్నాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ అయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నట్లు గుర్తించారు. విద్యుత్ లైన్ల పై గంజాయి బ్యాచ్ లు ఆ విధంగా విసిరిన ఐరన్ తీగలను గుర్తించిన విద్యుత్ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు. వరుసగా ఈ తరహా ఘటనలు జరగడంపై విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఎస్ ఈ చల్లా రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. ఇటువంటి ఘటనలతో ఆర్థిక నష్టంతో పాటు ప్రజల భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రమేష్ తెలిపారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




