యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్కు బిగ్ షాక్ తగిలింది. అతడిపై సూర్యాపేట కమిషనరేట్లోని నూతంకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ ఓ పోలీసు అధికారి ఫిర్యాదు చేశాడు. దీంతో సన్నీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఎక్కువైపోతున్నాయి. అదే సమయంలో వీటి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తమ కుటుంబ సభ్యులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ఎంతో మంది నిరాశ్రయులవుతున్నారు. తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించొచ్చు అనే కాన్సెప్ట్తో అప్పులు చేసి మరీ ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతున్నారు. చివరికి నష్టాల్లోకి కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
అదే సమయంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే యూట్యూబర్ నానిపై కేసు నమోదు చేశారు. అతడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మరో యూట్యూబర్పై పోలీసులు కేసు నమోదు చేశారు
యూట్యూబర్పై కేసు నమోదు
బయ్యా సందీప్ అలియాస్ సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాలలో (టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్) ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్లోని నూతన్కల్ పోలీస్ స్టేషన్లో బయ్యా సందీప్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
తన పోస్టుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులపై సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. బెట్టింగ్ ఇన్ప్లూయెన్సర్లపై తాను చేసిన ‘ఎక్స్’ పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ, సూర్యాపేట ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదని అన్నారు. చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని.. మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.. డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు
కాగా సన్నీ యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ యూట్యూబర్గా ఉంటున్నాడు. బైక్ రైడ్ వీడియోలతో చాలా మంది సబ్స్క్రైబర్లను పొందుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే అతడు మరింత సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహకులతో కుమ్మక్కయ్యాడని సజ్జనార్ ఆరోపించారు. తక్కువ పెట్టుబడితో సులభంగా డబ్బు సంపాదించాలని ఆసచూపి బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టమని తన సబ్స్క్రైబర్లను ఆదేశించాడని తెలిపారు. ఇలా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం ద్వారా.. సన్నీ యాదవ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాడని ఆరోపిస్తూ.. ఇది కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యకు దారితీస్తుందని పేర్కొన్నారు.
పలు సెక్షన్లు కింద కేసు
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐటీ చట్టం (2000-2008)లోని 111(2), 318(4), 46, r/w 61(2) BNS, 3, 4 TSGA, 66-C, 66-Dతో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతకు హాని కలిగించడంలో యూట్యూబర్ సన్నీ యాదవ్ ప్రమేయం ఉందని తెలిపారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





