SGSTV NEWS
Andhra Pradesh

బెజవాడ దుర్గమ్మ పుట్టినిల్లుగా పోలీస్‌ స్టేషన్‌ ప్రచారంలో నిజమెంత… ఆలయంపై పట్టుకోసమే ప్రచారాలు!



Durga Temple: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి పుట్టినిల్లుగా వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి చారిత్రక నేపథ్యానికి, వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు ఎలాంటి సంబంధం లేకున్నా ఈ ప్రచారం ఆగడం లేదు.


Durga Temple: విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణాన్ని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ పుట్టినిల్లుగా కొన్నేళ్లుగా విజయవాడ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. దీనికి చారిత్రకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఉత్సవాల నిర్వహణతో పాటు ఆలయంపై పట్టు సాధించేందుకు ఈ తరహా ప్రచారాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతాయి. విజయవాడ పట్టణంగా ఉన్నప్పటి నుంచి దసరా పండుగను వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దసరా సమయంలో 9రోజుల పాటు దశావతారాల్లో భక్తులకు దర్శనమిచ్చే కనక దుర్గ అమ్మవారు చివరి రోజు కృష్ణా నదిలో హంస వాహనంలో విహరిస్తారు. నదీ విహారం తర్వాత అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన సిబ్బంది ఊరేగింపుగా మెట్ల మార్గం వద్దకు చేరుస్తారు

జమ్మిదొడ్డిలోనే పూజలు…
మెట్ల మార్గం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన సింహవాహనంపై అమ్మవారిని ఆశీనురాలిని చేసి పారువేటోత్సవం నిర్వహిస్తారు. ఆ తర్వాత సింహవాహనంలో శమీపూజ జరిగే జమ్మిదొడ్డికి తీసుకు వెళ్తారు. పారువేటోత్సవం నిర్వహిస్తూ అమ్మవారి ఉత్సవ మూర్తిని జమ్మిదొడ్డి ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన దర్బారులో కొలువు చేస్తారు. విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించడం ఆనవాయితీగా వస్తోంది.

వనవాసంలో పాండవులు తమ ఆయుధాలను దాచడానికి శమీ వృక్షం అనువైదని భావించి ఆ చెట్టుకు పూజలు చేసి ఆయుధాలు భద్రపరిచినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈ కారణంగానే ఇంద్రకీలాద్రి దిగువున ఉన్న జమ్మిదొడ్డిలో ప్రత్యేకంగా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

అమ్మవారి ఆలయ క్షేత్రాన్ని కాపాడే వన్‌టౌన్‌ పోలీసులు తమ ఆడపడుచుగా భావించి జమ్మిదొడ్డిలో శమీ పూజలు నిర్వహించే వారు. పదిహేనేళ్ల క్రితం వరకు పాతబస్తీ స్టేషన్‌ సిఐ మాత్రమే ఈ పూజలు నిర్వర్తించేవారు. ఆ తర్వాత రోజు పోలీస్ క్వార్టర్లలో సిబ్బంది అంతా దసరా వేడుకలు చేసుకునే వారు. పాతబస్తీలో పోలీసులు భారీ ఎత్తున అన్నదానాలు నిర్వహించేవారు.

మారిపోయిన ఆనవాయితీలు…
గత కొన్నేళ్ళుగా దుర్గ గుడిలో పనిచేసే సిబ్బంది , అధికారులు తరచూ వివాదాల్లో చిక్కడం, అవినీతి కేసుల్లో ఇరుక్కోవడం రివాజుగా మారింది.ఈ క్రమంలో దుర్గగుడికి సంబంధించిన ఉత్సవాల నిర్వహణలో పోలీసుల ప్రమేయం ఏ ఏటికాయేడు పెరుగుతూ వస్తోంది.

2007లో భవానీ దీక్షల విరమణ సందర్భంగా దుర్గగుడి ఘాట్‌ రోడ్డులో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆలయానికి సంబంధించిన ఉత్సవాల నిర్వహణలో పోలీసులు కీలకంగా మారిపోయారు. ఆ తర్వాత కొన్నేళ్లకు వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు డివిజన్‌ స్థాయి హోదా రావడంతో ఉత్సవాల్లో సీఐల పాత్ర తగ్గింది.

దసరా ఉత్సవాల్లో సీఐలు నిర్వహించాల్సిన పూజల్లో ఏసీపీలు నిర్వహించడం మొదలైంది. పై అధికారుల్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో క్రమంలో పూజల్లో ఉన్నత అధికారుల్ని భాగం చేయడం మొదలైంది. చివరకు వన్‌టౌన్‌ పీఎస్‌లో జరిగే ఆయుధ పూజల్లో పోలీస్‌ బాస్‌లు పాల్గొనడం మొదలైంది.

ఉత్తర గోగ్రహణంలో అర్జునుడికి విజయాన్ని కలిగించడంతో అదే రోజు శమీ పూజ నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఈ ఉత్సవాలను వన్‌టౌన్‌ సీఐ, ఎస్సైలు నిర్వహించేవారు. పోలీసులు జమ్మి కొట్టిన తర్వాత అమ్మవారి ఉత్సవ మూర్తులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి తెల్లవార్లు పూజలు చేసి మర్నాడు ఉదయం ఆలయానికి చేర్చడంతో దసరా ఉత్సవాలు ముగిసేవని కనకదుర్గ క్షేత్రం స్థల పురాణ గ్రంథం చెబుతుంది. .

విభజన తర్వాత మారిన ఆనవాయితీలు..
రాష్ట్ర విభజన తర్వాత దసరా ఉత్సవాల నిర్వహణలో పోలీస్ ఉన్నతాధికారులు భాగం అయ్యారు. విజయవాడ కేంద్రంగా పాలనా వ్యవహారాలు సాగడంతో ఆచారాల్లో మార్పులు వచ్చేశాయి. పాతబస్తీ పోలీస్‌ స్టేషన్‌లో అమ్మవారికి దసరా పూజలు చేసే బాధ్యత సీఐల నుంచి పూర్తిగా ఉన్నతాధికారులకు మారిపోయింది. స్థానిక సీఐలు నామమాత్రం అయిపోయారు.

పుట్టినిల్లుగా ప్రచారం…
వన్‌ టౌన్‌ పోలీస్ స్టేషన్‌‌ను అమ్మవారి పుట్టినిల్లుగా ఇటీవల విస్తృత ప్రచారం జరుగుతున్నా దానికి సంబంధించి చారిత్రక ఆధారాలు ఎక్కడా లేవు. వన్‌టౌన్ పోలీస్‌ స్టేషన్ ప్రాంగణాన్ని బ్రిటిష్ కాలంలోనిర్మించినా ఆ తర్వాత దానిని పునర్నిర్మాణం చేశారు.

పాతబస్తీలో గాంధీజి మునిసిపల్ స్కూల్‌, పోలీస్‌ స్టేషన్ ప్రాంగణాలు ఉన్న ప్రదేశంలో నివాసాలను ఇతర ప్రాంతాలకు తరలించి వాటిని నిర్మించినట్టు స్థానికులు చెబుతారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి క్షేత్రాన్ని కాపాడే విధుల్లో ఉండే పోలీసులు ఉత్సవ మూర్తులతో ఆయుధ పూజలు చేసే ఆచారం మాత్రమే ఉండగా పోలీస్ స్టేషన్‌ను అమ్మవారి పుట్టినిల్లుగా ప్రచారం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

కొండపై పెత్తనం వారిదే…
ఒకప్పుడు దసరా వేడుకల్లో చివరి రోజు మాత్రమే పోలీసులకు పూజల్లో అవకాశం ఉండగా ప్రస్తుతం దుర్గగుడి రోజువారీ కార్యకలాపాల్లో సైతం పోలీసుల జోక్యం పెరిగిపోయిందనే విమర్శలు ఉన్నాయి. దుర్గగుడిల కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేక విభాగాలు ఉన్నా, ప్రోటోకాల్ దర్శనాలు సైతం పోలీసుల కనుసన్నాల్లోనే జరుగుతున్నాయని ఆలయ అధికారులు ఆరోపిస్తున్నారు. కొన్నాళ్లకు దుర్గగుడి నిర్వహణ మొత్తం పోలీసులకే అప్పగించినా ఆశ్చర్యం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు

దుర్గగుడిలో అంతరాలయ దర్శనాలకు విధిగా టోకెన్లు కొనుగోలు చేయాల్సి ఉన్నా అవేమి అమలు కావడం లేదని, ఐఏఎస్‌ స్థాయి అధికారుల్ని దుర్గగుడికి బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఉన్నా ప్రభుత్వం పట్టించుకో పోవడంతో పోలీసుల పెత్తనం పెరిగి పోతోందని ఆలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం ఈ సమస్యలకు కారణంగా కనిపిస్తోంది.

Also read

Related posts

Share this