SGSTV NEWS
Andhra PradeshCrime

దెయ్యాలు వెంబడిస్తున్నాయంటూ యువకుడు పరుగో పరుగు.. కట్ చేస్తే.. పీక కోసుకుని.!

కాలికి చిన్న ముల్లు గుచ్చుకుంటే బాధతో విలవిలలాడి పోతాం. పొరపాటున కూరగాయలు కుస్తుండగా, కత్తి తెగి రక్త స్రావమైతే ఇక పసుపు రాసి, త్వరగా ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటాం. కానీ ఎవరైనా పీక కోసేసుకుంటారా? కత్తితో తమను గాయపరుచుకుంటారా..? భీమవరంలో ఇదే జరిగింది. తనను చంపడానికి ఎవరో వస్తున్నారు, నా దగ్గరకు మీరు ఎవరూ రాకండి అంటూ నడిబజారులో ఒక యువకుడు కత్తితో తనకు తాను గాయపరుచుకుని చనిపోయాడు.

భీమవరంలో నడి రోడ్డుపై ఒక యువకుడు పరుగులు పెడుతున్నాడు. దెయ్యలు నన్ను వెంటాడుతున్నాయి.. చంపేస్తాయి. మిమ్మల్ని చంపేస్తాయి.. పారిపొండీ అంటూ ఓ యువకుడు హల్ చల్ చేశాడు. కత్తితో గాయాలు చేసుకుంటూ.. గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగిన ఘటన కాదు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో జరిగింది. నిత్యం వందలాది మంది ప్రజలతో రద్దీగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఘటన అందరిని కలవరపాటుకు గురిచేసింది.

నడిరోడ్డుపై మతిస్థిమితం లేని యువకుడు కత్తితో ఒంటిపై గాయాలు చేసుకుని, పీక కోసుకుని మృతి చెందాడు. ఉండి గ్రామం పెద్దపేటకు చెందిన తల క్రాంతి కుమార్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో అతని తండ్రి భీమవరం ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకుని వచ్చాడు. భీమవరం ప్రభుత్వ హాస్పిటల్ వద్ద నుండి పారిపోయి యనమదుర్రు డ్రైన్‌లోకి దూకాడు. ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికులు, ఫైర్ సిబ్బంది ఆ యువకుడిని కాపాడారు. ఆ తరువాత ఉండి రోడ్ లోని మల్టిప్లెక్స్ ఎదుట రోడ్డుకు చేరుకున్నాడు. అక్కడ జామకాయలు అమ్ముకునే బండి వద్ద ఉన్న కత్తిని తీసుకుని హల్చల్ చేశాడు.

కాలుపై తనను తాను గాయాలు చేసుకున్నాడు. రక్తం కారుతున్నా పట్టించుకోలేదు. అనంతరం పీక కోసుకోవడంతో నిశ్చలస్థితిలో పడిపోయాడు. తనపై తాను దాడి చేసుకుంటున్న సమయంలో ఆ యువకుడు మాట్లాడిన మాటలు అక్కడి వారికి విస్మయం కలిగించాయి. దెయ్యాలు.. దేవతలు వస్తున్నారని, తనకు కనపడుతున్నాయని, తనను చంపేస్తాయని ఆ యువకుడు మాట్లాడాడు. తన వద్దకు ఎవరూ రావద్దని బెదిరించాడు. దారుణమైన స్థితిలో ఉన్న యువకుడు వద్దకు వెళ్ళేందుకు అక్కడ ఉన్నవారంతా భయపడి పోయారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించేలోపే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మానసిక పరిస్థితి బాగోలేదని, నెల రోజుల నుండి వింతగా ప్రవర్తిస్తున్నాడని మృతుడి తండ్రి పోలీసులకు తెలిపాడు. ఇలాంటి ఘటనలు సినిమాల్లో మనం చూసివుంటాం. కానీ భీమవరం ప్రజలకు ఇపుడు ఇదే ఘటన ఆందోళనకలిగిస్తుంది

Also Read

Related posts

Share this