SGSTV NEWS online
Andhra PradeshCrime

మచిలీపట్నంలో దారుణం.. కోటి రూపాయల వివాదం నేపథ్యంలో వ్యక్తిపై కత్తి దాడి


మచిలీపట్నంలో త్రినాథ్ రావు అనే వ్యక్తి రజనీకుమారికి కోటి రూపాయలను బంగారం కోసం ఇచ్చారు. ఈ నగదు ఇవ్వాలని ఆమెను అడగడంతో తన భర్త గూడవల్లి రాజశేఖర్, మరి కొంతమంది వ్యక్తులతో ‌కలిసి కత్తితో దాడి చేయించారు.

కృష్ణా జిల్లా , జూన్ 27 : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆర్థిక లావాదేవీల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ ఆశ చూపి తన నుంచి కోటి రూపాయలు తీసుకున్నారని పెడసంగంటి రజనీకుమార్‌పై త్రినాధరావు ఆరోపించారు. అయితే ఏడాది కాలంగా డబ్బు తిరిగి ఇవ్వకుండా, సరైన సమాధానం కూడా చెప్పకుండా తాత్సారం చేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ నేపథ్యంలో తన డబ్బు వెనక్కు ఇవ్వాలని కోరుతూ త్రినాధరావు రజనీకుమార్ ఇంటికి వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలో రజనీకుమార్ తనను బెదిరించారని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని త్రినాధరావు ఆరోపించారు

అనంతరం సాయంత్రం 7 గంటల సమయంలో రజనీకుమార్ భర్త గూడవల్లి రాజశేఖర్‌తో పాటు మరికొందరు వ్యక్తులు కలిసి తనపై కత్తితో దాడి చేసినట్లు త్రినాధరావు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ త్రినాధరావు సెల్ఫీ వీడియో ద్వారా జరిగిన ఘటన వివరాలను  వెల్లడించారు. రజనీకుమార్ కారణంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి దారితీసిన పరిస్థితులు, ఆరోపణల నిజానిజాలు, ఇందులో పాల్గొన్న వ్యక్తుల పాత్రపై విచారణ చేపట్టారు. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Also read

Related posts