బాపట్ల మండలం భర్తిపూడిలో సీబీఐ అధికారులు ఆదివారం సాయంత్రం ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
బాపట్ల,: బాపట్ల మండలం భర్తిపూడిలో సీబీఐ అధికారులు ఆదివారం సాయంత్రం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణల వ్యవహారంలో వాయుసేనకు చెందిన కర్నల్ స్థాయి ఓ అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం మేరకు వాయుసేన అధికారి అవినీతికి సంబంధించి అందిన ఫిర్యాదుపై సీబీఐ రంగంలోకి దిగింది. విజయవాడ నుంచి సీబీఐ అధికారుల బృందం నాలుగు కార్లలో గ్రామానికి వచ్చి జీబీసీ రోడ్డు వద్ద అప్పికట్ల రైల్వేస్టేషన్ కు వెళ్లే మార్గంలో మకాం వేసింది. వల పన్ని సదరు అధికారిని భర్తిపూడి రప్పించి లంచం నగదు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. నగదు కట్టలు స్వాధీనం చేసుకోవడాన్ని స్థానికులు చూశారు.
ఈ వ్యవహారాన్ని కొందరు గ్రామస్థులు సెల్ఫోన్ లొ వీడియోలు, ఫొటోలు తీయబోగా సీబీఐ అధికారులు వారించారు. స్థానిక రైల్వేస్టేషన్ లోకి అధికారిని తీసుకెళ్లి కొద్దిసేపు విచారించారు. ఆయన వచ్చిన కారును స్వాధీనం చేసుకుని రైల్వేస్టేషన్ వద్దకు తరలించారు. సమాచారం తెలిసి అప్పికట్ల రైల్వేస్టేషన్ వద్దకు మీడియా బృందం వెళ్లగా సీబీఐ అధికారులు అనుమతించలేదు. దాడుల వివరాలు వెల్లడించటానికి నిరాకరించారు. పూర్తి స్థాయి సమాచారాన్ని అధికారికంగా సోమవారం తెలియజేస్తామని చెప్పారు. కొద్దిసేపు తర్వాత రెండు కార్లలో సీబీఐ అధికారులు సూర్యలంక వాయుసేన కేంద్రం వైపు వెళ్లారు. మిగిలిన రెండు కార్లలో వచ్చిన అధికారులు అప్పికట్ల రైల్వేస్టేషన్ వద్దే ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- గదిలోకి మాస్క్ లేకుండా రావొద్దు.. హీలియం గ్యాస్ పీల్చుకుని చార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్..
- అందగా ఉంటుందని.. అమాయకరాలు అనుకునేరు..! విశాఖ రాథోడ్ మామూల్ది కాదు..
- ప్రేమ పేరుతో దారుణం.. బస్సులో నుంచి దింపి పొలాల్లోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యం..!
- Hyderabad: గది తలుపు తెరిచేసరికి షాకింగ్ సీన్..! యువ ఆర్కిటెక్ట్ మృతిపై ఎన్నో అనుమానాలు..!
- Hyderabad: హలో.. నేను అనన్య కులకర్ణి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్కు సాఫ్ట్గా లైన్ కలిపింది.. కట్ చేస్తే..





