అది ఏజెన్సీ ప్రాంతం.. మారుమూల ప్రాంతాలకు రోడ్లు సరిగా ఉండవు. అంతంత మాత్రమే ఉన్న రోడ్లపై వాహనాల ప్రయాణించాలంటే సాహసం చేయాల్సిందే..! అందుకే మారుమూల ప్రాంతాల గిరిజనులు అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో చాలా చోట్ల ఇప్పటికీ కిలోమీటర్ల మేర వాహనాలు లేక డోలి కట్టాల్సిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో అక్కడి రోడ్లపై సాధారణ అంబులెన్సులు ప్రయాణించడం కూడా కష్టమే. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక బైక్ కు పక్కనే మరో డబ్బా లాంటిది పెట్టి.. అందులో పేషెంట్ను తీసుకెళ్లేదే ఫీడర్ అంబులెన్స్. డోలి కట్టి మోసుకెళ్ళలేని పరిస్థితుల్లో ఫీడర్ అంబులెన్స్ ను ఆశ్రయించిన ఆ గిరిజన కుటుంబానికి.. గుండె ఆగేంత పని అయింది. ఎందుకంటే ఒక్కసారిగా ఆ ఫీడర్ అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. అప్రమత్తం కాకుంటే…

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గుల్లెలలో అస్వస్థకు గురైన రోగిని ఆసుపత్రికి తరలించాలని గోమంగి ప్రాథమిక ఆసుపత్రికి సమాచారం వెళ్ళింది. దీంతో ఫీడర్ అంబులెన్స్గా పిలిచే బైక్ అంబులెన్స్ అక్కడకు చేరుకుంది. పేషెంట్ ను పికప్ చేసుకుని ఆసుపత్రికి బయలుదేరింది ఆ ఫీడర్ అంబులెన్స్. మార్గ మధ్యలో ఒక్కసారిగా ఆ వాహనం నుంచి పొగ, మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన టెక్నీషియన్, వెంటనే అంబులెన్స్ను ఆపి స్థానికుల సాయంతో పేషెంట్ను సురక్షితంగా కిందకు దింపి మంటలను అదుపు చేశారు. కాస్త ఆలస్యమైనా ప్రమాద తీవ్రత పెరిగేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక గిరిజనులు. ఆ తర్వాత పేషెంట్ను మరో వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. ముప్పు తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also read
- ఛీ.. ఛీ.. ఇదేం పని రా.. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో లైంగిక వేధింపులా..?
- శ్రీశైలంలో మహా అపచారం: గర్భగుడిలో మల్లికార్జున స్వామి వీడియో తీసిన భక్తుడు.. సోషల్ మీడియాలో వైరల్!
- Karimnagar SI : గన్నేరు పప్పు తిని భార్య మృతి.. మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న SI
- kakinada: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. కోతుల దాడిలో వృద్ధురాలి మృతి
- సినిమా స్టంట్ను తలపించిన స్కార్పియో యాక్సిడెంట్





