SGSTV NEWS online
Andhra PradeshCrime

పెళ్లి చేసుకోకు.. పురుగు మందు తాగి చచ్చిపో..!



చీపురుపల్లిరూరల్(గరివిడి): భవిష్యత్తు
గురించి ఎన్నో కలలు..ఆశలతో పెళ్లిపీటలు ఎక్కి ఏడడుగులు నడవాల్సిన యువతి ప్రేమపేరుతో మోసపోయింది. చివరకు కసాయి ప్రియుడి బెదిరింపులు, బ్లాక్మెయిల్తో ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన గరివిడి మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహితుడై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి ఆ యువతితో సన్నిహితంగా మెలిగి, అనంతరం ఆమెకు వివాహం కుదరడంతో పెళ్లిని అడ్డుకునేందుకు తీవ్ర వేధింపులకు గురి చేశాడు.

కసాయి ప్రియుడి బెదిరింపులు, బ్లాక్ మెయిల్ను తట్టుకోలేక యువతి పురుగు మందు తాగేయడంతో కుటుంబసభ్యులు గమనించి విజయనగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు గరివిడి మండలంలోని తోండ్రంగి గ్రామానికి చెందిన యువతి బలగం అఖిలకు ఇటీవల కుటుంబసభ్యులు వివాహం నిశ్చయించారు.

ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మాజీ ప్రియుడు కోరాడ రామునాయుడు ఆమెను ఫోన్లో పదేపదే సంప్రదిస్తూ పెళ్లి చేసుకోకు..పురుగు మందు తాగి చచ్చిపో.. నేను పురుగు మందు పంపిస్తున్నా, తీసుకుని తాగు అంటూ తీవ్రంగా మానసికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా పొరపాటున పెళ్లిపీటలు ఎక్కితే మన ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. ఈ బెదిరింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి మంగళవారం ప్రియుడు పంపించిన పురుగు మందు తాగేసి అపస్మాకర స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా కీ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. మృతురాలి తండ్రి బలగం రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts